సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువుదీరిన మొదటి రోజు నుంచే గత ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా వెళ్తోంది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ముందు లోక్ సభ ఎన్నికలు ఛాలెంజ్గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టాలంటే తామిచ్చిన హామీలను అమలు చేయడం చాలా కీలకమైన అంశం. ఈ నేపథ్యంలో సీఎంతో మాజీ ఆర్బీఐ గవర్నర్ భేటీ కావడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఆర్థిక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం కలిగిన రఘురామ్ రాజన్ గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉంటున్నారు.రాష్ట్ర ప్రగతిలో భాగంగా పలు రంగాల్లో తిరుగులేని పురోగతి సాధించామంటూ బీఆర్ఎస్ ఇన్నాళ్లు ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టిందని అధికార పక్షం వాదిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి పదేళ్ల కేసీఆర్ సర్కార్ నిర్వాకాన్ని బట్టబయలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇందులో భాగంగా వివిధ శాఖల ఆర్థిక పరిస్థితిపై వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో కేసీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ వేస్తున్నారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా వినిపిస్తున్న వేళ అనూహ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.గతంలో ఆర్బీఐ గవర్నర్గా పని చేసిన అనుభవంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక రంగంలో తన అనుభవాలను సీఎంతో రఘురామ్ పంచుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అమలుకు సాధ్యం కానీ హామీలు ఎలా ఇచ్చారని బీఆర్ఎస్ నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ రేవంత్ రెడ్డికి రఘురామ్ రాజన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి తామిచ్చిన హామీల అమలుకు అనుసరించాల్సిన కార్యాచరణ, గత ప్రభుత్వ హయాంలోని ఆర్థిక వైఫల్యాలపై ఫోకస్ పెట్టిన వేళ మాజీ ఆర్బీఐ గవర్నర్ సీఎంకు ఎలాంటి సలహాలు ఇచ్చి ఉంటారనేది ఆసక్తిగా మారింది.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొని రాహుల్ వెంట నడిచారు. గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సైతం ఆయన వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. అలాగే రాహుల్ గాంధీ తెలివైన వాడని కితాబిచ్చారు. దీంతో రాబోయే లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా దేశంలో ఆర్థిక విధానాలపై రఘురామ్ రాజన్ వంటి వారి సలహాలు తీసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది.