ఓబీసీల్లోకి తూర్పు కాపులు…..

రాజమండ్రి, (సిరా న్యూస్);
ఏపీలో తూర్పు కాపుల ప్రస్తావన రాగానే వెంటనే గుర్తుకొచ్చే ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ ప్రాంతంలోని మూడు ఉమ్మడి జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఎక్కువగా తూర్పు కాపుల సామాజిక వర్గ ప్రభావం కనిపిస్తుంది. అలాగే ఇక్కడి వెనుకబాటు తనం కారణంగా ఇతర ప్రాంతాలకు వలసపోయిన తూర్పు కాపుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే కాపులతో పోలిస్తే వీరిలో ఉన్న వెనుకబాటు తనం కారణంగా వీరిని గతంలో ప్రభుత్వాలు బీసీల జాబితాలో చేర్చాయి. కానీ ఉత్తరాంధ్రలో ఉంటున్న తూర్పు కాపులకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. 2014 ముందు వరకూ ఉత్తరాంధ్రతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న తూర్పు కాపులకు కూడా కేంద్ర ప్రభుత్వ ఓబీసీ రిజర్వేషన్ ఫలాలు దక్కేవి. కానీ 2014లో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రయోజనం కేవలం ఉాత్తరాంధ్రకే పరిమితం అయింది. విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్ ఇవ్వాలని మిగతా ప్రాంతాల్లో ఉంటున్న తూర్పు కాపులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని జాతీయ బీసీ కమిషన్ కు అప్పగించింది.. జాతీయ బీసీ కమిషన్ అధ్యయనం తర్వాత ఇప్పుడు తూర్పు కాపులందరినీ ఓబీసీ జాబితాలో చేరుస్తూ సిఫార్సు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నిన్న వెల్లడించారు. జాతీయ బీసీ కమిషన్ కేంద్రానికి ఈ మేరకు సిఫార్సు చేస్తే తూర్పు కాపులకు ఇక ఓబీసీ జాబితాలో చోటు దక్కినట్లేనని ఆయన తెలిపారు. దీంతో ఏపీలో లక్షల సంఖ్యలో ఉన్న తూర్పు కాపులకు ఇది గుడ్ న్యూస్ కాబోతోంది. ఏపీలో ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ తెలంగాణ ఎన్నికల తర్వాత టీడీపీతోనూ పొత్తు పెట్టుకోవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *