సిరా న్యూస్, పుట్టపర్తి:
భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా నిలిచారు. ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. సత్యసాయి బాబా వారు సత్యనారాయణ రాజుగా 1926 నవంబరు 23న పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి, ఓ నిరుపేద వ్యవసాయ భట్టు రాజుల కుటుంబంలో అనంతపురం జిల్లా లోని, పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించాడు. బాబాకు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. బాబా చిన్న వయసులోనే చాలా అద్బుతాలు చేశాడని చెబుతారు. చిన్న వయసులోనే బాబా అపర మేధావి, సేవాభావం గల వ్యక్తిగా ముద్ర పడ్డారు. అపర మేథావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులను వినిపించాడు.1940వ సంవత్సరం మార్చి 8వ తేదిన తన సోదరుడు శేషమ రాజుతో కలిసి ఉరవకొండలో ఉన్న సమయంలో బాబాను ఓ తేలు కుట్టిందంట. ఆ సమయంలో బాబా తన స్పృహను కోల్పోయారంట. తేలు కుట్టిన కొద్ది రోజులకు బాబా బిహేవియర్లో మార్పు వచ్చింది. తనకు తాను నవ్వుకోవడం, ఏడ్వటం, అప్పటికప్పుడే నిశ్శబ్దంగా మారి పోవడం చేసేవారు. ఆ సమయంలో ఇతను తనకు ఇంతకుముందు ఏ మాత్రం పరిజ్ఞానం లేని సంస్కృతంలో పాటలు పాడేవారు. బాబా పరిస్థితి చూసి వైద్యులు హిస్టేరియా అని నమ్మేవారు. దీంతో చేసేది లేక బాబా తల్లిదండ్రులు బాబాను పుట్టపర్తికి తీసుకు వచ్చారు. వారు బాబాను అనేకమంది వైద్యుల వద్దకు, ఆధ్యాత్మిక గురువుల వద్దకు తీసుకు వెళ్లారు.మే 23 1940లో బాబా చేసిన ఓ చర్య వల్ల బాబా తండ్రి బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడుగా భావించాడు. బాబా తండ్రి ఓ కర్ర తీసుకొని నీవెవరు అని అడిగాడు. అప్పుడు బాబా తాను షిరిడీ సాయిబాబా ప్రతిరూపాన్ని అని చెప్పాడు. ఆ తర్వాత బాబా తనకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్పారు. తాను షిర్డీ సాయికి ప్రతిరూపం అని చెప్పడం, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో ఆయనకు భక్తులు తయారవడం ప్రారంభం అయింది. పద్నాలుగేళ్లకే బాబా ఆధ్యాత్మిక మార్గం పట్టారు. ఆ తర్వాత సత్యసాయి మద్రాసుకు, దక్షిణ భారతంలో పర్యటనలు ప్రారంభించారు. దీంతో తొందరగానే ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు తయారయ్యారు. 1944వ సంవత్సరంలో భక్తులు బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభం అయిన ప్రశాంతి నిలయం 1950కి పూర్తయింది. 1957వ సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారత దేశ దేవాలయాల సందర్శనకు వెళ్లారు. 1954లోనే బాబా చిన్న పాటి గ్రీన్ హాస్పిటల్ను పుట్టపర్తిలో నిర్మించారు.