సిరా న్యూస్, రాజకోట్:
చరిత్రలో ఫస్ట్ టైం…
రోహిత్ సేన రికార్డు విజయం…
టెస్టు చరిత్రలో టీమిండియా రికార్డు గెలుపును నమోదు చేసింది.577 టెస్టుల చరిత్రలో.. పరుగుల పరంగా భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. రాజ్కోట్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో నెగ్గి ఈ ఘనత సాధించింది.అంతకుముందు న్యూజిలాండ్పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం.
ఈ క్రమంలో అయిదు టెస్టుల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో దూసుకెళ్లింది. 557 పరుగుల భారీ లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఛేదనలో 122 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్లో జడేజా ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో (112; 2 వికెట్లు) సెంచరీ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్ల్లో అయిదు వికెట్లతో సత్తాచాటాడు.అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 196/2తో ఇవాళ ఆటను ఆరంభించిన టీమిండియా నాలుగు వికెట్లకు 430 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్ (214*; 236 బంతుల్లో), శుభ్మన్ గిల్ (91; 154 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (68*; 72 బంతుల్లో) అదరగొట్టారు. ఆదివారం ఆటను భారత్ ఆచితూచి ప్రారంభించింది. నైట్వాచ్మన్ కుల్దీప్ యాదవ్ కుల్దీప్ యాదవ్ (27; 91 బంతుల్లో)తో కలిసి గిల్ స్కోరుబోర్డు నడిపించాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న గిల్ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. కుల్దీప్ అనవసరపు పరుగుకు ప్రయత్నించి నో చెప్పడంతో గిల్ వెనుదిరిగాడు. కాసేపటికే కుల్దీప్ కూడా ఔటయ్యాడు.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశారు. శనివారం ఆటలో 104 పరుగుల వద్ద రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగిన జైస్వాల్ ఇవాళ బ్యాటింగ్కు వచ్చాడు. అండర్సన్ బౌలింగ్లో అతడు వరుసగా మూడు సిక్సర్లు బాదడం ఇన్నింగ్స్కు హైలైట్గా నిలిచింది. ఈ క్రమంలో 231 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. సర్ఫరాజ్తో కలిసి అయిదో వికెట్కు 87 బంతుల్లోనే శతక భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే వరకు క్రీజులో నిలబడి వీరిద్దరు అభేద్యంగా 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అనంతరం భారీ ఛేదనకు దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ పోరాట పటిమ చూపలేదు. 50 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బెన్ డకెట్ (4; 15 బంతుల్లో), జాక్ క్రాలే (11; 26 బంతుల్లో), ఒలీ పోప్ (3; 14 బంతుల్లో), జానీ బెయిర్స్టో (4; 3 బంతుల్లో), జో రూట్ (7; 40 బంతుల్లో), బెన్ స్టోక్స్ (15; 39 బంతుల్లో), రెహాన్ అహ్మద్ (0) వరుసగా పెవిలియన్కు చేరారు. బెన్ ఫోక్స్ (16; 39 బంతుల్లో)తో కలిసి టామ్ హర్ట్లీ (16; 36 బంతుల్లో) కాసేపు వికెట్ పడకుండా అడ్డుకున్నారు. కానీ ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఆఖర్లో మార్క్ వుడ్ (33; 15 బంతుల్లో) ఓటమి అంతరాన్ని తగ్గించాడు. జడేజా అయిదు వికెట్లు, కుల్దీప్ రెండు, అశ్విన్, బుమ్రా తలో వికెట్ తీశారు. డకెట్ రనౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 445, ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది.