జూబ్లీ హిల్స్ రోడ్డు ప్రమాదం కేసు

మరోసారి దర్యాప్తు చేపట్టనున్న పోలీసులు
మాజీ ఎమ్మెల్యే కొడుకు రాహిల్ నిందితుడిగా చేర్పు
 సిరా న్యూస్,హైదరాబాద్;
జూబ్లీహిల్స్ లో రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంకేసులో కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకుని నిందితుడిగా జూబ్లీ హిల్స్ పోలీసులు చేర్చారు. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న కాజోల్ చౌహాన్ అనే మహిళను కారు ఢీకొట్టింది. చేతిలోని రెండు నెలల శిశువుని ఆమె వదిలి పెట్టింది. చేతిలోంచి కిందపడడంతో కాజోల్ రెండు నెలల కొడుకు రణ్వీర్ చెందాడు. ఘటన లో కాజోల్ గాయపడింది. ప్రమాదం జరగగానే సంఘటనా స్థలం నుంచి ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. కారుపై స్టిక్కర్ ఆధారంగా అది ఎమ్మెల్యే షకీల్ కు చెందినదిగా గుర్తించి ఘటనపై పోలీసులు ఐ పీ సీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్, స్నేహితులు ఆఫ్నాన్, మాజ్ ఉన్నట్లు గుర్తించారు. సీసీ ఫుటేజ్ కోసం చూడగా ఫుటేజ్ దొరకలేదు. కారు ఎవరు నడిపారు అన్నదానిపై అప్పట్లో స్పష్టత దొరకలేదు. కారు తానే నడిపానని ఆఫ్నాన్ అనే యువకుడు పోలీసులకు లొంగిపోయాడు. అకస్మాత్తుగా కాజోల్ రోడ్డు మీదకు రావడంతో కారు ఢీకొట్టిందనీ, భయంతో కారులో ఉన్న ముగ్గురం పారిపోయినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. దాంతో కేసులో ఆఫ్నాన్ ను నిందితుడిగా పేర్కొని అరెస్ట్ చేసారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. తాజాగా షకీల్ కొడుకు పాత్రపై అనుమానంతో మరోసారి దర్యాప్తు కు రంగం సిద్దం చేసారు. బాధితురాలు కాజోల్ వాంగ్మూలంతో పాటు లొంగిపోయిన ఆఫ్నాన్ వాంగ్మూలం పోలీసులు సేకరించారు. కారు నడిపింది షకీల్ కొడుకు రాహెల్ అంటూ వారు చెప్పడంతో 304 పార్ట్ 2 గా సెక్షన్ల మార్పు చేసారు. కేసును జూబ్లీ హిల్స్ పోలీసులు మరోసారి దర్యాప్తు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *