సిరా న్యూస్, హైదరాబాద్:
తెలంగాణలో ముగిసిన బడ్జెట్ సమావేశాలు…
చేసిన తీర్మానాలు ఇవే
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. 8 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు పలు తీర్మానాలు చేసింది కాంగ్రెస్ సర్కార్.ఇరిగేషన్పై శ్వేత పత్రం విడుదల, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై సభ వాడివేడిగా చర్చించింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళతో సభ దద్దరిల్లింది. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు, ఇరిగేషన్ శాఖపై శ్వేత పత్రం మీద జరిగిన చర్చతో ముగిసాయి. ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో బీసీ కులగణనపై సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తేలేదని సభ తీర్మానించింది. 2.75 లక్షల కోట్ల బడ్జెట్పై సభలో సుధీర్ఘ చర్చ జరిగింది. అయితే గవర్నర్ ప్రసంగం, బడ్జెట్, ఇరిగేషన్ పై వైట్ పేపర్, కేఆర్ఎంబీ వంటి విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ తప్పుబట్టింది. దీనికి కౌంటర్గా అన్ని అనర్దాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం అంటూ.. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దంగా ఉందని సభలో పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.అయితే ప్రభుత్వ వాదనను బీఆర్ఎస్ బలంగా తిప్పికొట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ గత తమ పాలన వల్ల తెలంగాణకు చేకూరిన ప్రయోజనాలను బీఆర్ఎస్ వివరించే ప్రయత్నం చేసింది. 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయలేదని మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి ఆరోపించారు. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలయాపన చేయకుండా తక్షణం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేరుకు ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలు అయినప్పటికీ ఇరిగేషన్ పైనే ఎక్కువ చర్చ జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రం చేతిలో పెట్టేందుకు మీ హాయాంలోనే బీజం పడిందని కాంగ్రెస్, బీఆర్ఎస్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. కేఆర్ఎంబీ సమావేశంలో గత ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పలు ఆధారాలను సభ ముందు ఉంచింది. అయితే కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగించేదుకు కాంగ్రెస్ ఒప్పుకుందని బీఆర్ఎస్ తిప్పికొట్టింది. కేఆర్ఎంబీ సమావేశంలో నమోదు చేసిన మినట్స్ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు రెండు పక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేసాయి. గట్టివాదోపవాదాలు అనంతరం ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించబోమని తీర్మానం చేసారు.
చివరిరోజు సభలో ఇరిగేషన్శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, కాళేశ్వరంలో అవకతవకలు, మేడిగడ్డలో పిల్లర్లు కుంగుబాటు లాంటి అంశాలను సభ ముందు ఉంచారు ఉత్తమ్. గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మానుకోవాలని, అన్ని రకాల విచారణలకు తాము సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే న్యాయ విచారణ చేయాలని బీఆర్ఎస్ సవాల్ విసిరింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలమేరకు బీసీ కులగణన చేపట్టే విధంగా అసెంబ్లీ తీర్మానించింది. అయితే ఈ తీర్మానం సందర్భంగా సభలో వాడివేడి చర్చ జరిగింది. సామాజిక, ఆర్దిక, రాజకీయ రంగాల్లో వెనకబడిన బీసీల ప్రయోజనం కోసం తీర్మానం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తీర్మానం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని బీసి జనగణనకు చట్టబద్ధత కల్పించే విధానం సభలో బిల్లు ప్రవేశ పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేసాయి. అయితే ప్రభుత్వం మాత్రం తీర్మానం ద్వారానే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని బీసీ కులగణన త్వరలోనే చేపడుతామని ప్రకటించి తీర్మానంను ఆమోదింపజేసుకుంది.అయితే సభ జరుగుతున్న సమయంలోనే బీఆర్ఎస్ నల్లగొండలో భారీ బహిరంగ నిర్వహించడం, మేడిగడ్డలో పిల్లర్ల కుంకుబాటు స్థలం వద్దకు ఎమ్మెల్యేలను తీసుకెళ్ళడం, సభ వెలుపల జరిగిన ఈ రెండు సంఘటనలు రాజకీయ దుమారం లేపాయి. 8 రోజుల పాటు 45 గంటల 32 నిమిషాలు సభ జరగగా, వివిధ అంశాలపై 59 మంది సభ్యులు మాట్లాడారు. 64 మంది సభ్యులు జీరో అవర్లో మాట్లాడగా, 2 తీర్మానాలను సభ ఆమోదించినంది. 3 బిల్లులకు ఆమోదం తెలిపగా 1 షార్ట్ డిస్కషన్ జరిగింది. పార్టీల వారిగా కాంగ్రెస్కు 8 గంటల 43 నిమిషాలు,
బీఆర్ఎస్ కు 8 గంటల 41 నిమిషాలు, బీజేపీకి 3 గంటల 48 నిమిషాలు, ఎంఐఎంకు 5 గంటలు, సీపీఐకి 2 గంటల 55 నిమిషాలు మాట్లాడే అవకాశం లభించింది. శాసన మండలి 11 గంటల 5 నిమిషాల పాటు జరిగింది. మొత్తంగా 9 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగగా, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ ఆవరణలో నిరసన వ్యక్తం చేసారు.