సిరా న్యూస్,అదిలాబాద్;
ప్రతి ఏడాది నకిలీ విత్తనాలు ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ప్రతీ వానాకాలంలో నాసిరకం, నకిలీ విత్తనాల బెడద రైతులకు పెను సవాల్గా మారింది. ఫర్టిలైజర్ వ్యాపారుల మాయజాలంతో రైతులు మోసపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు ఈ దందాను సాగిస్తుంటే… అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వానాకాలం సీజన్కు ముందే గ్రామాల్లో తిష్ఠ వేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. అమాయక రైతులే టార్గెట్గా ఈ ముఠాలు చెలరేగిపోతున్నాయి. అనుమతి లేని విత్తనాలు అన్నదాతలకు అంటగడుతూ అందినకాడికి దండుకుంటున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం అదే రిపీట్ అయింది.నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నా… ఎక్కడ కూడా నకిలీగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఏకంగా సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కేంద్రంగా నకిలీ ముఠా రెచ్చిపోయింది. హుస్నాబాద్లో టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించి… 9 క్వింటాళ్ల 72 కిలోల నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. వేణు అనే వ్యక్తి సరఫరా చేసినట్టు గుర్తించారు. అంతేకాదు సాకేత్, రేవంత్ రకం విత్తనాలకు భారీ డిమాండ్ ఉండటంతో ధరలు పెంచి రైతులను దోచుకుంటున్నారు. అటు మిర్యాలగూడలో 5లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.మరోవైపు సీజన్ ఆరంభంలోనే విత్తనాల కొరత ఏర్పడింది. డిమాండ్కి తగ్గట్టు సరఫరా లేకపోవడంతో విత్తనాల కోసం.. రైతులు ఆగ్రో కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 5లక్షల 30 వేల ఎకరాల్లో పంటలు సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు.. రైతుల కోసం 10వేల 300 మెట్రిక్ టన్నుల జిలుగు, 2వేల 366 క్వింటాళ్ల జనుము, 50 వేల 900 క్వింటాళ్ల యూరియా అవసరం అవుతుంది. కానీ, ఇప్పటివరకు ఇందులో సగం కూడా రైతులకు అందలేదు. ఎరువులు, విత్తనాల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. సరిపడా విత్తనాలు అందక నానా పాట్లు పడుతున్నారు.ఈ సీజన్లో ప్రారంభంలోనే భారీగా నకిలీ విత్తనాలను వివిధ శాఖల అధికారులు పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఓవైపు అక్రమార్కులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా మరోవైపు అనుమతిలేని విక్రయాలు విస్తుగొలుపుతున్నాయి. మరింత అప్రమత్తం కాకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గత అనుభవాలు హెచ్చరిస్తున్నాయి.