సిరా న్యూస్,న్యూ డిల్లీ;
ఢిల్లీలోని భారత పార్లమెంట్ భవనం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. మొన్న జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనతో కేంద్ర బలగాలు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు పార్లమెంట్ ఆవరణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఢిల్లీలోని భారత పార్లమెంట్లో భారీ భద్రతాలోపం బయటపడిన విషయం తెలిసిందే. బుధవారం శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జీరో అవర్లో ఇద్దరు ఆగంతకులు లోక్సభ లోకి ప్రవేశించి హంగామా సృష్టించారు. కలర్ స్మోక్ వదిలి ఎంపీలను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.ఇందులో భాగంగానే పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నారు. మళ్లీ ఎవరూ ఇలాంటి భద్రతా ఉల్లంఘనలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. భవనం చుట్టు భద్రతా సిబ్బంది డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. అక్కడికి వస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పార్లమెంట్ భవనం ఎంట్రీ పాయింట్ వద్ద పోలీసుల భద్రత విధుల్లో ఉన్న వీడియో ఏఎన్ఐ ట్విట్టర్లో పోస్టు చేసింది.