సిరా న్యూస్,;
దాదాపు మూడు రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే చర్చ. ఇది ఎప్పుడూ జరిగే డిబేట్ అయినప్పటికీ ఇటీవల లోక్సభలో ఈ ప్రస్తావన రావడం వల్ల మరోసారి చర్చ జరుగుతోంది. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాస్త గట్టిగానే స్పందించారు. నెలసరి అనేది వైకల్యం కాదని, సెలవులు ఇచ్చి వివక్ష చూపించలేమని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని ఎంత మంది సమర్థించారో అంత మంది వ్యతిరేకిస్తున్నారు. అసలు అమలు చేయాలా వద్దా అని ప్రశ్నిస్తే ఒక్కొక్కరూ ఒక్క సమాధానమిస్తున్నారు. అందులో ఎక్కువగా వినిపిస్తున్న సమాధానం “వివక్ష”. నిజానికి పీరియడ్స్ అనేది బయాలజికల్ ప్రాసెస్. ప్రతి మహిళలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ నార్మాలిటీని వేరుగా చూసి వాళ్లకు సెలవులు ఇవ్వడం వల్ల వివక్ష చూపించినట్టే అవుతుందన్నది ఓ వాదన. పీరియడ్స్ టైమ్లో మహిళలు పొత్తికడుపు నొప్పితో బాధ పడతారు. కండరాల నొప్పి కూడా మెలిపెడుతుంది. వాటికి తోడు తలనొప్పి ఇబ్బంది పెడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్లకు సెలవులు ఇవ్వడం అనేది మానవతా కోణంలో సరిగానే అనిపిస్తుండొచ్చు. కానీ నెలసరి సరిగ్గా రాని మహిళల పరిస్థితేంటి..? వాళ్లు సెలవులు తీసుకోకపోతే నెలసరి రావడం లేదని అందరికీ అర్థమైపోదా..? వాళ్లు రహస్యంగా ఉంచాలనుకున్న సమస్యలు బయట పడాలా..? అన్నది మరో వాదన. పిసిఓడితో బాధ పడుతున్న మహిళలకు రెగ్యులర్గా పీరియడ్స్ రావు. భారత్లో నెలసరి వస్తున్న మహిళల్లో దాదాపు 20% మంది పిసిఓడితో ఇబ్బంది పడుతున్నట్టు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. మరి వాళ్ల సంగతేంటి..అని కొందరు మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఏ వాదన ఎలా ఉన్నా ఇప్పటికే చాలా కంపెనీలు మహిళా ఉద్యోగులకు పీరియడ్ లీవ్స్ ఇచ్చే ఆలోచన చేశాయి. కొంత మంది అందుకు సంబంధించిన పాలసీలూ సిద్ధం చేశాయి. జొమాటో అందులో ఒకటి. వాస్తవానికి పీరియడ్ లీవ్స్ గురించి 1992 నుంచే చర్చ జరుగుతోంది. అప్పట్లో బిహార్ ప్రభుత్వం కేటగిరీలో వీటిని అమల్లోకి తీసుకొచ్చింది. కానీ…అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి. అదేదో అంటరాని జబ్బులా కాకుండా నార్మలైజ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీరియడ్స్పై ఆలోచనా విధానం కూడా మారిపోతోంది. దాన్నో డిజబిలిటీగా చూడొద్దని వాదిస్తున్నారు. కేరళ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీల్లోని యువతులకు నెలసరి సెలవులు ప్రకటించింది. విద్యార్థుల విషయంలో చూసుకుంటే మాత్రం ఈ నిర్ణయాన్ని చాలా మంది సమర్థిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. కొన్ని మారుమూల ప్రాంతాల్లో నెలసరి సమయంలో అమ్మాయిలు స్కూల్కి, కాలేజ్కి వెళ్లడానికి అసౌకర్యంగా ఫీల్ అవుతారు. కొన్ని స్కూల్స్లో టాయిలెట్స్ సరిగ్గా ఉండవు. ఇక ప్యాడ్లు మార్చుకోవడం అంటే నరకం. కొందరికి ప్యాడ్స్పై సరైన అవగాహన కూడా ఉండదు. అందుకే చాలా మంది నెలసరి రోజుల్లో ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక మరీ వెనకబడిన ప్రాంతాల్లో అయితే పూర్తిగా చదువు మానేస్తున్నారు. ఫలితంగా ఏటా డ్రాపౌట్లు పెరుగుతున్నాయి. మహిళలకు నెలసరి సెలవులుఇచ్చేందుకు ఏవో కొన్ని సంస్థలు మాత్రమే ముందుకొస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం..మహిళలకు నాలుగైదు రోజుల పాటు సెలవులు ఇచ్చేస్తే ప్రొడక్టివిటీ పడిపోతుందని. ఇప్పటికే మెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నాం కదా..మళ్లీ ఇవేంటి అని ప్రశ్నిస్తున్నాయి కొన్ని కంపెనీలు.