హైదరాబాద్, (సిరా న్యూస్);
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని, ఆయనను తీవ్రంగా అవమానించిందని, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్ట కరమని అన్నారు.ఆయన మనందరం అభిమానించే వ్యక్తి అని, భూమి పుత్రుడని, తన జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన అలాంటి మానవతామూర్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందని మంత్రి చెప్పారు.1996లో సిట్టింగ్ ప్రధానిగా ఉన్న పీవీ నర్సింహారావుకు ఎంపీ టికెట్ నిరాకరించి.. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని మంత్రి తెలిపారు. పీవీ మరణించినప్పుడు కనీసం 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయాన్ని అనుమతించకుండా అవమానించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ చరిత్ర గురించి ప్రియాంకాగాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ కుటుంబానికి రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.