స్మార్ట్ గా మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్, (సిరా న్యూస్);
భర్త చనిపోవడంతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బును చేజేతులారా నేరస్థుల చేతుల్లో పెట్టేసింది ఓ మహిళ. సైబర్ నేరగాళ్లు వేసిన వలలో చిక్కుకున్న బాధితురాలు తన అకౌంట్ లోని 1 కోటి 59 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లకు పంపించింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఆగస్టులో సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం.. రాచకొండ పరిధిలో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తుంది బాధితురాలు. ఇటీవల తన భర్త అకాలమరణంతో మృతి చెందాడు. తన భర్త పేరుమీద ఉన్న 1 కోటి 59 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు బాధితురాలు ఖాతాలో జమ అయ్యింది.ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు బాధితురాలు ఫోన్ నెంబర్‌కు కాల్ చేశారు. కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని మాట్లాడారు. మీకు వచ్చిన పార్శిల్‌లో నార్కోటిక్ పదార్థాలు ఉన్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని మభ్య పెట్టారు. ఇంతలోనే ముంబై పోలీస్ పేరుతో మరొక కాల్ రావడంతో నిజమేకావొచ్చని ఆమె భావించింది. దీంతో సైబర్ నిందితుల ట్రాప్‌లో చిక్కుకుంది. మత్తు పదార్థాల పార్శిల్‌ పై బాధితురాలపై అరెస్టు వారెంట్ జారీ అయిందని మరో ఫేక్ కాల్ సృష్టించారు కేటుగాళ్లు. తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని మరో కొత్త బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో జమ చేసుకోవాల్సిందిగా ముంబై పోలీసులు బాధితురాలికి సూచించినట్టుగా ప్లాన్ చేశారు. దీంతో ఆమె కొత్త అకౌంట్ లోకి ఆర్టిజిఎస్ ద్వారా డబ్బు మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేయగానే కేటుగాళ్లు మొత్తాన్ని లూటీ చేశారు.తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఈ ఏడాది ఆగస్టులో ఆశ్రయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *