సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరస్థుడిని అరెస్ట్ చేశారు. పెట్టుబడుల పేరుతో బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు తీసుకొని నిండా ముంచుతున్న ఘరానా మోసగాడు చదలవాడ రవీంద్రబాబును సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పంజాగుట్ట ఠాణాలో నమోదైన కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో నెల రోజుల పాటు నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీసీఎస్ ఏసీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఏపీలోని నెల్లూరు ప్రాంతానికి చెందిన చేదలవాడ రవీంద్రబాబు బీఎస్సీ పూర్తి చేశాడు. కొనేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. ముందు ఉప్పల్ లో డైరీ ఫార్మ్ బిజినెస్ చేసిన రవీంద్రబాబు ఆపై ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ కాంట్రాక్టర్ గా మారి నిజామాబాద్ నుంచి కాంట్రాక్టు పనులు ప్రారంభించాడు. అప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లోనూ ఈ కాంట్రాక్ట్ లను దక్కించుకొని తన వ్యాపారాన్ని విస్తరించాడు. అక్కడ వరకు బాగానే ఉన్నా…..ఆపైనే అసలు కథ మొదలు పెట్టాడు.ఫలానా కాంటాక్ట్ పూర్తి కావస్తుందని, అవసరమైన మొత్తం పెట్టుబడిగా ఇవ్వాలని పరిచయస్థులతో పాటు ప్రైవేట్ సంస్థలని ఆశ్రయించేవాడు. వీటితో పాటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంత అవసరాలకు వాడుకునేవాడు. హైదరాబాద్ లోని నాచారం ఎస్బీఐ నుంచి గతంలో దాదాపు రూ. 179 కోట్ల రుణం తీసుకొని మోసం చేశాడు. కోల్ కతాలో ఒక సబ్ స్టేషన్ నిర్మాణానికి కాంట్రాక్ట్ దక్కించుకొని దానికి సంబంధించిన పత్రాలను బ్యాంక్ లో సమర్పించి రూ.179 కోట్ల రుణం తీసుకొని బ్యాంక్ ను మోసం చేశాడు. అయితే అప్పటికే రవీంద్రబాబు పశ్చిమబెంగాల్, బీహార్, చత్తీస్ గఢ్, కర్ణాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కాంట్రాక్టర్లు చేసి ఉండడంతో అతడికి తేలికగా రుణం, అప్పులు లభించాయి.రూ. 40 కోట్ల మోసంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లలో రవీంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి. అతడిపై నాన్ బెయిలబుల్ వారంట్ ఇష్యూ కావడంతో సీసీఎస్ ఏసీపీ అశోక్ కుమార్ రంగాల్లోకి దిగారు. రవీంద్ర బాబు ఎక్కడ ఉన్నాడనే అంశాన్ని సాంకేతికంగా ఆరా తీయగా… ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో దాదాపు నెల రోజుల నుంచి అతని కదలికలను గమనిస్తూ వచ్చారు. బెంగళూరు, దిల్లీ, ముంబయిలో సంచరించిన నిందితుడు రవీంద్రబాబును సోమవారం ఈడీ కేసు నిమిత్తం ఆ కార్యాలయంలో హాజరు కావడానికి వచ్చారు. ఆ సమాచారాన్ని తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. రవీంద్రబాబుపై ఏపీలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కర్ణాటక ,రాజస్థాన్ ,మహారాష్ట్ర, సీబీఐ కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో అతడు రూ.200 కోట్ల రుణాలు తీసుకున్నట్లు నిందితుడు రవీంద్రబాబు అంగీకరించాడు.