హైదరాబాద్, (సిరా న్యూస్);
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో కనీస ప్రాథమిక ఆధారాలను కూడా సీఐడీ చూపించలేకపోయిందని స్పష్టం చేసింది. ఆరోగ్య కారణాలతో ఇచ్చిన మధ్యంతర బెయిల్ సందర్భంగా పెట్టిన షరతులను 29వ వరకూ కొనసాగిస్తూ తర్వాత వాటినీ తొలగించారు. వీటిపై సీఐడీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసింది. విచారణకు వచ్చినా బెయిల్ రద్దు చేయడం అనేది ఉండకకపోవచ్చని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవని హైకోర్టు తేల్చడమే కాకుండా అప్పటికే చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఈ కారణంగా బెయిల్ రద్దు చేయకపోవచ్చని చెబతున్నారు. మరి చంద్రబాబునాయుడుకు ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని అడ్డంకులు తొలగినట్లేనా ?. స్కిల్ కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన చంద్రబాబుకు పూర్తి స్థాయిలో రిలీఫ్ దొరికినట్లు కాదు. ఎందుకంటే ఆయనపై ఉన్నది ఆ ఒక్క కేసు కాదు. మొత్తం ఆరు కేసులు ఉన్నాయి. అందులో ఒక్క కేసులోనే బెయిల్ వచ్చింది. మిగిలిన అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏమీ తేలడం లేదు. వరుసగా సీఐడీ విచారణ సందర్భంగా వాయిదాలు కోరుతూనే ఉంది. వాయిదాలు పడుతూనే ఉంది. ఒక్ వేళ అన్నింటిలోనూ రిలీఫ్ వచ్చినా.. మరి కొన్ని కేసులు పెట్టడానికి సీఐడీ రెడీగా ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో రెండు, మూడు నెలల పాటు ప్రజల్లోకి వెళ్లకుండా ఉన్న సందర్భాలు దాదాపుగా లేవు. అరెస్టు అయిన సమయంలోనూ ఆయన రాజకీయ యాత్రలో ఉన్నారు. భవిష్యత్ కు భరోసా పేరుతో ఆయన పూర్తి స్థాయిలో యాత్రలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మూడు నెలల సమయం వృధా అయినందున.. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నందున ఇక చంద్రబాబు.. పర్యటనల్లోనే ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. జనసేన ను సమన్వయం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో రాజకీయం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు పూర్తి స్థాయి రాజకీయంపై..సుప్రీంకోర్టులో రావాల్సిన 17ఏపై తీర్పే ఆధారం కానంది. ఆ తీర్పు కోసమే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.