70 వేల కోట్ల రూపాయిలు ఎలా…

సిరా న్యూస్,విజయవాడ;
ఏపీ రాజకీయ చదరంగంలో టీడీపీకి షాక్‌ మీద షాక్‌ ఇస్తోంది బీజేపీ.. దేశవ్యాప్తంగా మోదీ గ్యారెంటీ అంటూ ఎన్నికల హామీలిస్తున్న బీజేపీ.. ఏపీలో మాత్రం టీడీపీ-జనసేన హామీలకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితులు స్పష్టంగా ఉండటం.. టీడీపీ-జనసేన అడ్డగోలు హామీలకు ఓకే చెబితే.. ఆ తర్వాత ఆ హామీలు అమలు చేయలేక ఆ పార్టీలు చేతులెత్తేస్తే తమకు చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ముందే జాగ్రత్త పడుతున్నారు కమలనాథులు.ఏపీలో ఎన్నికల తర్వాత ఏం జరగబోతోందో… కూటమిలోని కీలక పాత్రధారి బీజేపీ ముందే ఊహిస్తోందా? అన్న అనుమానాలే ఎక్కువవుతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీ సంక్షేమ పథకాలను విమర్శించిన టీడీపీ-జనసేన, ఇప్పుడు అవే పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తామని చెప్పడం.. ఆ పథకాలకు నిధులు ఎలా సమకూరుస్తుందో చెప్పలేకపోవడాన్ని గమనిస్తున్న కమలం పార్టీ.. ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎలాంటి మచ్చ లేకుండా పరిపాలన సాగిస్తుండగా, ఇప్పుడు టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో రూపంలో అమలు చేయలేని హామీలకు బాధ్యత వహించడం ఆత్మహత్యసదృశ్యంగానే భావిస్తోంది బీజేపీ. అందుకే ఉమ్మడిగా మ్యానిఫెస్టో విడుదల చేద్దామన్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపాదనకు నో చెప్పేసింది బీజేపీ అధిష్టానం. చివరకు ఉమ్మడి వేదికలో మ్యానిఫెస్టో కాపీని పట్టుకోడానికి కూడా అంగీకరించకుండా తమకు.. టీడీపీ మ్యానిఫెస్టోకూ ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది బీజేపీ.వాస్తవానికి కూటమిలో బీజేపీ పాత్రపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీతో జట్టు కట్టడానికి తొలి నుంచి ఆ పార్టీ ఆసక్తి చూపలేదు. కానీ జనసేనాని పవన్‌ బలవంతంతో పొత్తుకు అంగీకరించాల్సి వచ్చిందని కమలనాథులు ఇప్పటికీ చెబుతున్నారు. ఉచిత పథకాలకు వ్యతిరేకమైన తమ పార్టీ.. చంద్రబాబు ఇచ్చే హామీలకు బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తే.. ఆ ఎఫెక్ట్‌ దేశవ్యాప్తంగా తమకు ప్రతికూలమవుతుందని వాదిస్తున్నారు బీజేపీ నేతలు. అంతేకాకుండా ఇప్పటికే 2014 ఎన్నికలో చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టో అమలు చేయలేదని, దీనికి బీజేపీ బాధ్యత వహించాలని సీఎం జగన్‌ తన ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికల మ్యానిఫెస్టోతో తమకు ఎలాంటి సంబంధం లేదని ముందే చెప్పాలని నిర్ణయించుకుంది బీజేపీఏపీలో సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏటా దాదాపు 50 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. వీటికి చంద్రబాబు చెప్పే పథకాలు కలిపితే మరో 70 వేల కోట్లు అవసరమవుతాయని సీఎం జగన్‌ ఇంతకుముందే చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గమనిస్తే చంద్రబాబు హామీలు అమలు చేసే పరిస్థితి లేదని, నెరవేర్చే హామీలు మాత్రమే ఇస్తానని తన మ్యానిఫెస్టోతో తేల్చిచెప్పారు సీఎం జగన్‌.ఇప్పటికే సంక్షేమంలో దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న వైసీపీ.. టీడీపీతో పోటీగా లేనిపోని హామీలు ఇవ్వకపోవడాన్ని గుర్తించిన బీజేపీ.. ముందుగా జాగ్రత్త పడిందనే టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి తాజా పరిణామాలతో కూటమిలో బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *