కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు

సిరా న్యూస్,న్యూఢిల్లీ;
వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో అదనంగా 75 వేల సీట్లు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఎర్రకోట మీదుగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ఇచ్చిన ఆయన ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా హెల్త్‌కేర్ రంగంలో సిబ్బంది కొరత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమస్య తీర్చాలని ప్రభుత్వం ముందుకి ఎన్నో డిమాండ్‌లు వచ్చాయి. ఈ క్రమంలోనే మోదీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. అడ్మిషన్‌ల కోసం ఎంతో డబ్బు ఖర్చు చేసి సీట్‌ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులను ఉద్దేశించి ఈ ప్రకటన చేశారు మోదీ. ఇకపై ఈ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని అన్నారు. గత పదేళ్లలో దాదాపు లక్ష వరకూ మెడికల్ సీట్‌లు పెంచామని స్పష్టం చేశారు.అయినా..ఏటా కనీసం 25 వేల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడ మెడిసిన్ చదువుతున్నారని అన్నారు. ఈ సమస్య లేకుండా వచ్చే ఐదేళ్లలో మెడికల్ సీట్‌లు పెంచాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 88% మేర మెడికల్ కాలేజ్‌ల సంఖ్య పెరిగినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2014లో 387గా ఉన్న కాలేజీల సంఖ్య ఇప్పుడు 731కి పెరిగిందని స్పష్టం చేసింది. హాస్పిటల్స్ సంఖ్యనీ పెంచనున్నట్టు ఇప్పటికే మోదీ సర్కార్ ప్రకటించింది. అందుకోసం బడ్జెట్‌లో రూ.90 వేల కోట్ల నిధులు కేటాయించింది. ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారంతో మెడికల్ సీట్‌ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అడ్మిషన్‌ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారన్న వాదనలు వినిపించాయి. ఇదంతా సీట్ల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల జరిగిందని వాదించిన వాళ్లూ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ఇకపై ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే…సీట్‌ల సంఖ్య పెంచడం సంగతి సరే మరి అక్కడ భద్రత సంగతేంటని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు. కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్ అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయంగానూ పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా ఆమెపై అత్యాచారం జరిగిన తీరు అందరికీ తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. అంత పాశవికంగా ప్రవర్తించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా డాక్టర్‌లు నినదిస్తున్నారు. మహిళా భద్రత సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మోదీ చేసిన ప్రకటనతో “మెడికల్ సీట్‌లు పెంచడం కాదు. కాలేజీల్లో భద్రత పెంచండి” అని సోషల్ మీడియాలో కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు. “సీట్‌లు పెంచి ఏం లాభం..? ఇలాంటి దారుణాలు జరగాలనేనా” అని ఘాటుగా స్పందిస్తున్నారు. “వైద్య విద్యను అంత ఖరీదు చేసేసి సీట్‌లు పెంచితే ఎవరికి ఉపయోగం” అని ఇంకొందరు వాదిస్తున్నారు.
ఆకాశమే హద్దుగా ఎదుగుదాం
మూడవసారి దేశానికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. దేశంలో 60 ఏళ్ల తర్వాత వరుసగా మూడోసారి దేశానికి సేవ చేసే అవకాశాన్ని ఒక పార్టీకి ప్రజలు కల్పించారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదాల్లో తనకు ఒకే ఒక సందేశం కనిపిస్తోందన్నారు. ప్రతి వ్యక్తికి సేవ, ప్రతి కుటుంబానికి సేవ, ప్రతి ప్రాంతానికి సేవ చేస్తూ అభివృద్ధిలో కొత్త శిఖరాలు చేరుకోవాలనే సందేశం ప్రజలు ఇచ్చారన్నారు. ఇలాంటి తీర్పు ఇచ్చిన ప్రజలకు తాను కృతజ్ఞత తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు మోదీ. ప్రతి పని, సౌకర్యం కోసం ప్రభుత్వానికి చేయి చాచే పని లేదన్నారు ప్రధాని మోదీ. నేడు ప్రభుత్వం ఇంటింటికీ కుళాయి నీరు, గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తోంది. ఇవి చిన్నచిన్నవే అయినా ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. 2947నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చేందుకు సూచనలు చేయాలని ప్రజలను కోరారు మోదీ. ఇప్పటికే వచ్చిన సూచనలు మన పౌరుల కలలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. కొంతమంది భారతదేశాన్ని నైపుణ్యాల రాజధానిగా మార్చాలని సూచించారని పేర్కొన్నారు. మరికొందరు భారతదేశం తయారీ కేంద్రాలు కావాలని అన్నారు. దేశం స్వావలంబన సాధించాలని, గ్రీన్‌ఫీల్డ్ నగరాలు నిర్మించాలి, భారతదేశం సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలి ఇలా చాలా సూచనలు ప్రజలు చేశారు. వీటి కోసం మరింత కష్టపడి పని చేస్తామన్నారు. దేశ ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి రంగంలో పనిని వేగవంతం చేయడంపై దృష్టి పెట్టామన్నారు. మార్పు కోసం అవసరమైన మౌలిక సదుపాయాలపై పని చేద్దామన్నారు. పౌరుల మౌలిక వసతులు పటిష్టం చేయాలని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో రోడ్లు, రైల్వేలు, హైవేలు, పాఠశాలలు,కళాశాలలు, ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, రెండు లక్షల పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్, నాలుగు కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజల కోసం అవసరం లేని 1500కు పైగా చట్టాలు రద్దు చేశామని గుర్తు చేశారు. చిన్న చిన్న తప్పులకే జైల్లో పెట్టే చట్టాలు రద్దు అయ్యాయని వివరించారు. క్రిమినల్ లా మార్చామన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ మిషన్ దిశగా అడుగులు వేయడానికి సహాయం చేయమని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగమే మనతో ముడిపడి ఉన్న భవిష్యత్తు అని మోదీ అన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో చాలా మెరుగుపడ్డామన్నారు. వందలాది స్టార్టప్‌లు వచ్చాయని తెలిపారు. భారతదేశాన్ని బలోపేతం చేయడంలో ఈ అంతరిక్ష రంగం ముఖ్యమైందిగా అభివర్ణించారు. నేడు ప్రైవేట్ ఉపగ్రహాలు, రాకెట్లను ప్రయోగిస్తున్నారు. మన విధానం, ఉద్దేశాలు సరైనవి అయితే కచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయని అన్నాకుతమపై నమ్మకంతో బాధ్యతల అప్పగించినప్పుడు భారీ సంస్కరణలు చేపట్టాం. మేము కేవలం చప్పట్లు కొట్టడం కోసం కాకుండా మార్పు కోసం సంస్కరణలు ఎంచుకున్నాం. బలవంతంగా సంస్కరణలు అణలు చేయడం లేదు, కానీ బలోపేతం చేయడానికి అమలు చేస్తున్నాం. రాజకీయాల కోసం సంస్కరించడంలేదు. భారతదేశం గొప్పగా మారాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *