సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అయిన సీఎం.. రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను సీఎంతో పాటు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి కలిశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికారులను అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాను రేవంత్రెడ్డి ఢిల్లీ నార్త్బ్లాక్లోని ఆయన కార్యాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు అంశాలను అమిత్ షా దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని, న్యూఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలని, చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకోవడం విషయంపై దృష్టిసారించాలని కేంద్ర హోం శాఖ మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్లు అదనంగా కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్లోని రాజ్భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి భవనాలను ఆంధ్రప్రదేశ్ వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు ఇప్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.