సిరా న్యూస్;
నిన్నమొన్నటి వరకు వంటనూనెలు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడా జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది. ప్రస్తుతం క్వింటా సన్న బియ్యం ధర రూ.6,500కు చేరింది. ఇదే అదనుగా భావించి పలువురు బ్రోకర్లు రైస్ మిల్లుల దగ్గర నుంచి కొన్న ధరకు అదనంగా కేజీకి 5 నుంచి 8 రూపాయలు బాదుతున్నారు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో 25 కిలోల పాత బియ్యం బస్తా 15వందల రూపాయల పైమాటే. గతేడాది గతేడాది సన్న బియ్యం ధర క్వింటాకు రూ.3 వేల నుంచి రూ.3500 వరకు ఉంది. అదే పాతబియ్యమైతే 4200 వరకు ఉండేది. కానీ ఇప్పుడు 6వేల నుంచి 6వేల 500 వరకు వెళ్లింది.నిన్నమొన్నటి వరకు కిలో బియ్యం రూ. 45 నుంచి రూ.50 మధ్య లభించగా ఇప్పుడా ధర ఏకంగా రూ. 60కి పెరిగింది. కొంచెం మంచి రకాలైతే రూ. 70 వరకు చెల్లించుకోవాల్సి వస్తున్నది. ప్రజలు ఎక్కువగా వినియోగించే సన్న రకాలైన బీపీటీ, హెచ్ఎంటీ, సోనామసూరి ధరలు సగటున క్వింటాలుకు రూ.1000 నుంచి రూ. 1500 వరకు పెరిగాయి. నిరుడు క్వింటాలు రూ. 4,500 నుంచి రూ. 5 వేల మధ్య లభించగా ఇప్పుడు ఏకంగా రూ. 6,200 వరకు పెరిగింది. ఇందులో పాతబియ్యం అయితే రూ.7,500 వరకు పలుకుతున్నది. హెచ్ఎంటీ, బీపీటీ కొత్త రకం బియ్యం ధర గతంలో క్వింటాలుకు రూ. 3,300 నుంచి రూ. 3,500 వరకు ఉండగా ఇప్పుడది రూ. 4,500కు చేరింది. మొత్తంగా బియ్యం ధరలు సగటున రూ. 1000 పెరిగాయి.బియ్యం ధరల పెరుగుదలకు ఆయా రాష్ర్టాల్లో వరిసాగు తగ్గడం కూడా ఒక కారణమని చెప్తున్నారు. నిజానికి ఈ వానకాలంలో దేశవ్యాప్తంగా వరిసాగు పెరిగినప్పటికీ కొన్ని రాష్ర్టాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులకు తోడు, మరికొన్ని రాష్ర్టాల్లో వరదల కారణంగా భారీగా పంటనష్టం సంభవించింది. ఇది అంతిమంగా బియ్యం ధరపై ప్రభావం చూపిస్తున్నది. దీనికితోడు సన్నాల సాగు కూడా గణనీయంగా పడిపోయింది. ప్రతి ఏటా వానకాలంలో మొత్తం సాగులో 50 శాతం సన్నాలు ఉండగా, ఈసారి మాత్రం 30 శాతానికే పరిమితమైంది. తెలంగాణలో ఈ వానకాలంలో రికార్డుస్థాయిలో 65 లక్షల ఎకరాల్లో వరిసాగైంది. ఈ లెక్కన దాదాపు 1.40 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి కావాల్సి ఉండగా పౌరసరఫరాల సంస్థ కొనుగోలులో ఇది 45 లక్షల టన్నులకే పరిమితమైంది. గతంలో ఎంతోకొంత సన్నాలు వచ్చేవి. ఈ సీజన్లో మాత్రం కేజీ బియ్యం కూడా కొనుగోలు కేంద్రాలకు రాలేదు. బియ్యం ధరలు అమాంతం పెరగడంతో సామాన్యుల బడ్జెట్కు చిల్లు పడుతున్నది.బియ్యానికి ప్రస్తుతం ఉన్న డిమాండ్ను మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. హైదరాబాద్లో సాధారణ రకం బియ్యం 25 కిలోల బస్తా ధర రూ. 180 నుంచి రూ. 250 చొప్పున పెరిగింది. ఈ లెక్కన గతంలో రూ.1200 ఉన్న 25 కిలోల బస్తా ధర ప్రస్తుతం రూ. 1,350 వరకు ఉంది. ఫైన్ క్వాలిటీ బియ్యమైతే రూ. 1,650-1,800 మధ్య పలుకుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు ధరలు మరింత పెరగక తప్పని పరిస్థితి నెలకొంటుందని వ్యాపారులు చెప్తున్నారు.ద్ది నెలలుగా నిత్యావసరాల ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉండటంతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి తగ్గిపోయింది. ఈ ఏడాది ఖరీఫ్లో సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. సాధారణంగా రైతులు ఎక్కువగా వానకాలం సీజన్లోనే సన్న వడ్లు సాగు చేస్తుంటారు. అయితే.. ఈ వానకాలంలో జిల్లాలో సన్న ధాన్యం సాగు గణనీయంగా తగ్గినట్లు వ్యవసాయ శాఖ యంత్రాంగం అంటున్నది. అటు తుఫాను ప్రభావంతో కూడా బియ్యం ధరలు మరింత పెరుగనున్నాయి. మరోవైపు బియ్యం ధరలు పెరుగుతాయని ముందుగానే ఊహించిన వ్యాపారులు.. పక్కా పథకంతో ఉన్నారు. రైతుల నుంచి సన్న వడ్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. వాటిని బియ్యంగా మార్చి ధరలు పెరిగినప్పుడు అమ్ముకుంటున్నారు. పలు చోట్ల కృత్రిమ కొరత సృష్టించి ధరలు భారీగా పెరిగేలా చేస్తున్నారంటూ ప్రజలు వాపోతున్నారు.ఇదిలా ఉంటే, వర్షకాలంలో చాలా మంది రైతులు దొడ్డు రకం వడ్లను మాత్రమే పండించారు. సన్న వడ్ల దిగుబడి తక్కువగా ఉంటుంది. పైగా సన్నాలకు చీడపీడల బాధలు ఎక్కువ. దీంతో రైతులు సన్నాలకు బదులుగా దొడ్డు వడ్లనే పండించారు.. పంట సాగుబడి తగ్గటం వల్ల కూడా సన్నాల ధరలు పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.