Renuka Cement Facotory Issue: రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం…
+ కాంగ్రేస్‌ నాయకులు బాలూరి గోవర్ధన్‌ రెడ్డి
+ తన స్వగృహంలో రైతులతో భేటి
+ సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామని హామీ

రేణుక సిమెంట్‌ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు అండగా ఉండి, న్యాయం అందేలా చూస్తామని కాంగ్రేస్‌ పార్టి నాయకులు బాలూరి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఆదిలాబాద్‌ పట్టణంలోని తన ఇంటికి వచ్చిన భూ నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ సమస్యలను గోవర్ధన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గతం ప్రభుత్వం అవలంభించిన విధానాలతో తాము తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. భూ సేకరణ కోసం గ్రామ సభ నిర్వహించి, 80శాతం మంది నిర్వాసితులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. కాకపోతే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూ సేకరణ కోసం గ్రామ సభ నిర్వహించకుండా, ఈ నిబంధనను సడలించిందన్నారు. అనంతరం గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ… ఆదిలాబాద్‌ జిల్లాలోని రామాయి వద్ద సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 664ఎకరాల 21గుంటల భూమిని రైతుల వద్ద నుండి సేకరించేందుకు గత ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందలేదన్నారు. అటు పరిహారం అందకా, ఇటూ ధరణిలో తమ పేర్లు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన్య వ్యక్తం చేసారు. గత ప్రభుత్వం గ్రామ సభ నిబందనను సడలించడం వలన రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టకుండా, ఫ్యాక్టరీ యాజమాన్యమే నిర్వాసితుల నుండి నేరుగా భూములు కొనుగోలు చేస్తే రైతుల మంచి ధర లభిస్తుందన్నారు. ఈ సమస్యను ఆదిలాబాద్‌ ఇంచార్జీ మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి, నిర్వాసితులకు లబ్ది చేకూరేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *