శానససభా పక్ష నేతగా వెంకటరమణారెడ్డి…?

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులు గడిచిపోయాయి. కానీ ఇప్పటికీ కూడా బీజేపీ తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోలేదు. ఈ నేపథ్యంలో శాసనసభా పక్ష నేతను ఎంపిక చేసే ప్రయత్నంలో భాగంగా తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ తరుణ్‌ చుగ్‌లు తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే నేతను ఎంపిక చేసేందుకు ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో అభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది. ఈసారి బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారిలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్, నిర్మల్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి మినహా అందరూ కొత్తవారే. అంటే ఈ ఎన్నికల్లో 8 మంది బీజేపీ నుంచి గెలుపొందగా అందులో ఆరుగురు కొత్తవారే. అయితే రాజసింగ్‌తో సహా మరికొందరు ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేత పదవి కోసం పోటీ పడుతున్నారు. రాజసింగ్ పార్టీకి సీనియర్ నాయకులు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభాపక్ష నేతగా తనకు అవకాశం కల్పించాలని రాజసింగ్‌ పార్టీ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది.అలాగే నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన కూడా బీజేపీ ఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దలను కోరినట్లు సమాచారం. అయితే ఎక్కువమంది ఎమ్మెల్యేలు మహేశ్వర్‌ రెడ్డిని శాసనసభా పక్ష నేతగా ఎంపిక చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుతం సీఎం రేవంత్‌ రెడ్డిలను ఓడించిన వెంకటరమణ రెడ్డికి కూడా ఈ పదవి ఇస్తే ఎలా ఉంటుందని తరుణ్ చుగ్‌ అడగగా.. ఇందుకు ఎమ్మెల్యేలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.మరోవైపు బీసీగా తనకు శాసనసభా పక్ష నేతగా అవకాశం ఇవ్వాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ కూడా కోరినట్లు సమాచారం. అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించిన తర్వాతే శాసనసభా పక్ష నేతను ఎంపిక చేస్తామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. అయితే బీజేపీ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *