సిరా న్యూస్,గుంటూరు;
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తెరపైకి ప్రత్యేక హోదా.. ఎన్నికల వేళ మళ్లీ బ్యానర్ ఐటమ్గా మారిపోయింది. స్పెషల్ స్టేటస్ను ఇన్నాళ్లు కోల్డ్ స్టోరేజీలో పడేసిన పార్టీలు.. ఇప్పుడు దుమ్ము దులిపి రెడీ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. 2019 ఎన్నికల సమయంలో వినిపించిన హోదా పదం.. ఇప్పుడు మళ్లీ ప్రతిధ్వనిస్తోంది. కారణం.. ఎన్నికల జాతరలో ఓట్లు కొల్లగొట్టడానికీ..! ప్రధాన పార్టీలు హోదాను ఆయుధంగా మలచుకోవాలని సంసిద్ధమవుతుంటే.. ప్రజాసంఘాలు మాత్రం ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నాయి.ఓటుకి.. హోదాకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎప్పుడు ఓటు అన్న పదం వినిపిస్తుందో అప్పుడు హోదా అన్న వాదన తెరపైకి వస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా.. ఇది పాతపాటే. కానీ మళ్లీ కాస్త సౌండ్ పెంచుకుని రీసౌండ్ చేస్తోంది. టీడీపీని కార్నర్ చేస్తూ అధికార వైసీపీ మళ్లీ ఆరోపణాస్త్రాలు సంధించింది. అంతా చంద్రబాబే చేశారు.. ఆయన కారణంగానే హోదా వెనక్కి పోయిందని ఆరోపించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. స్పెషల్ ప్యాకేజీకి అంగీకరించి హోదాను అటకెక్కించారని మండిపడ్డారు బుగ్గన. ఏపీని అప్పుల పాలు చేశారన్న చంద్రబాబు కామెంట్లపైనా కౌంటర్ ఇచ్చారు బుగ్గన రాజేంద్రనాథ్. టీడీపీ హయాంలో చేసిన అప్పులు, స్థూల ఉత్పత్తిని అంకెలతో సహా వివరించారు.ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చింది.. రాష్ట్రానికి హోదా రాకుండా చేసింది ఆ రెండు పార్టీలేనని ఆరోపించారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. హోదా ముగిసిన అధ్యయం కాదని.. కలిసి పోరాడితే కచ్చితంగా సాధ్యమవుతందని ఆశాభావం వ్యక్తం చేశారు. హోదా ఇవ్వకుండా కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాడే దమ్మున్నోళ్లు కావాలన్నారు ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. హోదా కోసం నీతి, నిజాయితీతో ఎవరు పోరాడుతున్నారో ప్రజలు గమనించాలన్నారు.ఎవరి వాదన వారిదే. క్రెడిట్ కోసం పాకులాటలా మారిపోయింది సిట్యువేషన్. కేంద్రం ముగిసిన అధ్యాయమని చెబుతున్నా.. అన్ని పార్టీలు హోదా పల్లవి అందుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ అదే జరుగుతోంది. మరి హోదా కోసం నిజంగా ఎవరు పోరాటం చేస్తున్నారు..? ప్రజలు ఎవరి వైపు ఉంటారన్నది చూడాలి..!