Early Sankranti celebrations at Gayatri Vidyanikethan: గాయత్రి విద్యానికేతన్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు

సిరా న్యూస్,పెద్దపల్లి;
పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో విద్యార్థినులకు ముందస్తు సంక్రాంతి వేడుకలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల ఆకృతులలో వేసిన రంగవల్లులు అందరినీ ఆకర్షించాయి. ముఖ్యంగా చిన్నారులు వేసిన ముగ్గులు, ఒక అమ్మాయి, బంధాలను గూర్చి తెలిపే సందేశాత్మక ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రకరకాల బొమ్మలతో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుని పిల్లలు ఆసక్తిగా వీక్షించారు. అనంతరం బాలురకు గాలిపటాల పోటీ నిర్వహించగా, అందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు హరిదాసు వేషధారణలో రావడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం భోగి మంటలు వేసి, వాటి చుట్టూ పిల్లలు, టీచర్లు అందరూ చేరి ఆనందంతో నృత్యం చేశారు. గాయత్రి విద్యా నికేతన్ కరస్పాండెంట్ రజనీ దేవి కూడా వారితో పాటు నృత్యం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ పిల్లలు వేసిన వివిధ ముగ్గులను, బొమ్మల కొలువుని ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం కరస్పాండెంట్ అల్లెంకి రజనీ దేవి మాట్లాడుతూ సంక్రాంతి పండగ అనేది కష్టపడి పండించిన పంట ఇళ్లకి చేరే సమయం. ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పేందుకు ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరించి పాటలు పాడతారని అన్నారు. ఈ పండగ అందరి జీవితాల్లో నూతన కాంతులు తేవాలని ఆకాంక్షిస్తూ అందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, నవీన్, స్రవంతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *