సగం కానున్న జిల్లాలు..

33 కాదు..ఇక 15…?

సిరా న్యూస్,హైదరాబాద్;
పది జిల్లాతో ఏర్పడిన తెలంగాణను గత సీఎం కేసీఆర్‌.. తన లక్కీనంబర్‌ కలిసేలా జిల్లాల సంఖ్యను 33కు పెంచారు. అశాస్త్రీయంగా, అసంబంద్ధంగా పాత చిల్లాలను చిలువలు పలువలుగా విభజన చేశారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలో ఒకటిన్నర నియోజకవర్గమే ఉండడం ఇందుకు నిదర్శనం. ఇక కొన్ని జిల్లాల్లో ఒక నియోజకవర్గం మూడు జిల్లాల్లో ఉంది. దీంతో ఒక ఎమ్మెల్యే మూడు జిల్లా పరిషత్‌లలో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఉండాల్సిన పరిస్థితి. 2016లో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టిన కేసీఆర్‌ కొడుకు అడిగాడని ఒక జిల్లా.. కూతురు అడిగిందని మరో జిల్లా.. ఎవరూ అడగకపోయినా తన లక్కీ నంబర్‌ రావడం లేదని మరో జిల్లా.. ఇలా ఇష్టానుసారం జిల్లాలను ప్రకటించారు. పాలనా సౌలభ్యం అని ప్రకటించినా.. అధికారం అంతా ప్రగతిభవన్‌లోనే ఉండడంతో జిల్లాల విభజనతో పెద్దగా ప్రజలకు ఒనగూరింది ఏమీలేదు. రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి దొరికింది. కొత్త జిల్లాలతో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులు పెరిగాయి. కొత్త మండలాలతో ఎంపీపీ పదవులు పెరిగాయి. రెవెన్యూ డివిజన్లతో ఆర్డీవోలు పెరిగారు. ఇవి మినహా ఏమీ మారలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆశాస్త్రీయ జిల్లాల విభజనపై పునఃసమీక్షించాలని భావిస్తోంది. జిల్లాల సంఖ్యను కుదించాలనే ఆలోచనలో ఉంది.ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల క్రితం జిల్లాల పునర్విభజన చేపట్టారు. పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించారు. దీంతో 13 జిల్లాలు ఉన్న ఏపీలో ప్రస్తుతం 23 జిల్లాలు ఏర్పడ్డాయి. శాస్త్రీయంగా జరిగిన పునర్విభజనతో అక్కడ అంతా సాఫీగా సాగిపోతోంది. అంతకన్నా ముందే జిల్లాల పునర్‌ వ్యవస్తీకరణ చేసిన కేసీఆర్‌.. ఎక్కడా శాస్త్రీయత పాటించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పునర్విభజనపై ఓ కమిటీని ఏర్పాటు చేసి.. కుందించే ఆలోచనలో ఉన్నారు. ఏపీ తరహాలోనే పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలను 17 జిల్లాలుగా ఏర్పాటు చేయడంతోపాటు, హైదరాబాద్‌ను రెండు జిల్లాలుగా విభజించి మొత్తంగా 18 జిల్లాలకు పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 33 జిల్లాలు ఎందుకని.. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు జ్యుడీషియల్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో జిల్లాల కుదింపు అంశం ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం జిల్లాలను అడ్డగోలుగా, పద్ధతి లేకుండా విడగొట్టిందని రేవంత్‌ ఇంటర్వ్యూలో విమర్శించారు. దీంతో జిల్లాల సంఖ్యను కుదిస్తారని అంతా భావిస్తున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇందులో ములుగు, జగగిత్యాల, వనపర్తి, నారాయణపేట, గద్వాల, సిరిసిల్ల జిల్లాలు విస్తీర్ణంలో చాలా చిన్నవి. ఈ జిల్లాల్లో కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలే ఉన్నాయి. ఇలాంటి జిల్లాలను ఎత్తివేస్తారని తెలుస్తోంది. మొత్తంగా 33 జిల్లాలను 18 జిల్లాలకు పరిమితం చేస్తారని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.అయితే జిల్లాల కుదింపు అంత ఈజీ కాదన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు నిర్మించారు. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారు. జోనల్‌ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించారు. లోకల్, నాన్‌లోకల్‌ కేడర్‌పై స్పష్ట ఇచ్చారు. మరోవైపు జిల్లాల విభజనతో జిల్లా కేంద్రాల్లో భూముల ధరలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లాలను కుదిస్తే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో జిల్లాల అంశాన్ని కదిలిస్తే తేనెతుట్టెను కదిలించినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *