Pipparwada Toll Plaza: పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా ఉద్యోగులు ఉంటారా? ఊడుతారా?

సిరా న్యూస్, డిజిటల్‌:

పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా ఉద్యోగులు ఉంటారా? ఊడుతారా?
+ డైలమాలో 75మంది ఉద్యోగుల జీతాలు
+ అధికారం మారడంతో అందరిలో హైరానా

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజాలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు ఉంటాయా? ఊడుతాయా? అంటూ మండలవాసుల్లో ఓ కొత్త చర్చ మొదలైంది. ఈ టోల్‌పాజాలో 6 గురు సూపర్‌వైజర్లు, 53మంది టోల్‌ కలెక్షన్‌ సిబ్బంది, మరో 6గురు కింది స్థాయి సిబ్బంది కలిపి మొత్తం 75మంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీ సంవత్సరం ఇక్కడ టెండర్లు మారిన, కాంట్రాక్టర్లు మారిన ఈ ఉద్యోగులు మాత్రం పర్మినెంట్‌గా ఇక్కడే పనిచేయడం జర్గుతుంది. అయితే 15సంవత్సరాల తరువాత ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో అధికారం మారింది. బీఆర్‌ఎస్‌కు చెందిన జోగు రామన్న ఎమ్మెల్యేగా ఓడిపోయి బీజేపీ నుంచి పాయల్‌ శంకర్‌ గెలుపొందారు. సుధీర్ఘ కాలం పాటు ప్రతిపక్షంలో ఉండి, అధికారంలోకి వచ్చిన పాయల్‌ శంకర్‌ అదిలాబాద్‌లో తన పట్టు నిలుపుకొని, తన మార్క్‌ పాలన అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలో కాంగ్రేస్‌ పార్టి అధికారంలోకి రావడంతో, ఆ పార్టీ ఆదిలాబాద్‌ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి సైతం ఆదిలాబాద్‌లో పార్టి బలోపేతంతో పాటు తనకంటూ స్వంత ఇమేజ్‌ను బిల్డప్‌ చేయడంపై దృష్టి సారించారు. దీంతో ఆదిలాబాద్‌లో రానున్న రోజుల్లో బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ అనిపించేలా రాజకీయాలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పిప్పర్‌వాడ టోల్‌పై ప్రభావం…
ఆదిలాబాద్‌లో కొత్తగా మారిన రాజకీయ పరిణామాల తాలుకు ప్రభావం టోల్‌ప్లాజాపై సైతం పడే అవకాశం లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. పిప్పర్‌వాడ టోల్‌ప్లాజాలో ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు, ప్రత్యేకంగా చెప్పాలంటే బీఆర్‌ఎస్‌ సానుభూతి పరులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అత్యధికంగా ఉద్యోగాలు చేస్తున్నారు. నెలకు రూ. 10 నుండి 25వేల జీతాలు ఉండే ఈ ఉద్యోగాలు అందరికి అంత ఈజీగా దొరకవనేది అందరికి తెలిసిన సత్యమే. స్థానికంగా బలమున్న ప్రజాప్రతిని«ధి సిఫార్సు ఉంటేగానీ ఇక్కడ ఉద్యోగం దొరకడం కష్టమేనని జనాల టాక్‌. అయితే ప్రస్తుతం ఆదిలాబాద్‌లో అధికారం మారడంతో ఈ పాత ఉద్యోగుల స్థానంలో కొత్త బీజేపీ, కాంగ్రేస్‌కు చెందిన కొత్త ఉద్యోగులు వస్తారా? లేదంటె పాత వాళ్లనే కొనసాగిస్తారా? అంటూ ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

ఇద్దరిని తొలగించిన కొత్త కాంట్రాక్టర్‌…
టెండర్‌లో ఇటీవలే పిప్పర్‌వాడ టోల్‌ప్లాజాను దక్కించుకున్న హైద్రబాద్‌కు చెందిన కొత్త కాంట్రాక్టర్‌ ఈ మధ్యనే ఇద్దరు ఉద్యోగులను విధుల్లోంచి తీసేసినట్లు సమాచారం. ఈ ఇద్దరు ఉద్యోగులు కొత్త కాంట్రాక్టర్‌ రాకముందు కొత్తగా విధుల్లోకి చేరగా, వారి సేవలు అవసరం లేదని కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిని మరల చేర్చుకోవాలని రాజకీయ పరంగా చాలా ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, సదరు కాంట్రాక్టర్‌ మాత్రం నో చెప్పినట్లు సమాచారం. దీంతో మిగిలిన ఉద్యోగుల్లో సైతం తమ ఉద్యోగాలు ఉంటాఆ? ఊడుతాయా? అంటూ కొంత భయం మొదలైనట్లు వినికిడి. ఇదిలా ఉంటే ఆదిలాబాద్‌లో చాల ఏళ్ల తరువాత బీఆర్‌ఎస్‌ను కాదనీ బీజేపీ, కాంగ్రేస్‌లు ఇప్పుడిప్పుడే అధికారం అనుభవిస్తున్న ఈ తరుణంలో, టోల్‌ప్లాజాలపై కొరఢా ఝులిపిస్తారా? లేదంటే కరుణించి వదిలేస్తారా? అనేది చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *