సిరా న్యూస్,హైదరాబాద్;
సంక్రాంతి పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించే పతంగుల పండుగ ప్రాణాలు తీస్తోంది. సరదాగా, ఆనందంగా జరుపుకోవాల్సిన కైట్ ఫెస్టివల్ కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ లో పతంగుల కారణంగా పలువురు మృతి చెందారు.బిల్డింగ్స్ పైకి ఎక్కి గాలిపటాలు ఎగరవేస్తూ పలువురు యువత ప్రాణాలు కోల్పోతున్నారు. నగరంలోని వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు ముగ్గురు యువకులు నిర్లక్ష్యంగా గాలిపటాలు ఎగురవేస్తూ ముత్యువాత పడ్డారు. అత్తాపూర్ లో తనిష్క్, నాగోల్ లో శివ ప్రసన్న, పేట్ బషీరాబాద్ లో ఆకాష్ చనిపోయిన వారిలో ఉన్నారు.ఇక, పతంగుల మాంజా వైర్ చుట్టుకొని లంగర్ హౌస్ లో ఆర్మీ జవాన్ కోటేశ్వర రెడ్డి మరణించారు. మాంజా వైర్ మెడకు చుట్టుకోవడంతో ఆయన గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రోడ్డు, చెట్లు, కరెంట్ స్థంభాలపై ఎక్కడపడితే అక్కడ ప్రమాదకరంగా మాంజా వేలాడుతూ కనిపిస్తోంది. కాగా, పతంగుల మాంజాను ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.