రుణమాఫీ పై ప్లాన్ ఏ, ప్లాన్ బీ

సిరా న్యూస్,హైదరాబాద్;
రైతు రుణ‌మాఫీ ఎలా చేయాలనే దానిపై రేవంత్ స‌ర్కార్ తర్జనభర్జన పడుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరి సింగిల్ స్ట్రోక్‌లో రుణ‌మాఫి చేయడమా? లేక రైతుల‌ అప్పుల‌కు బ్యాంకు గ్యారంటీ ఇవ్వడమా అనే దానిపై కసరత్తు మొదలు పెట్టింది. ఏదిఏమైనా సరే ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణమాఫీ హామీని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందననే పట్టుదలతో ఉన్నారు రేవంత్‌. రుణమాఫీ అమలు కోసం స‌ర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.తెలంగాణ‌లో రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చి నెల రోజులైంది. ఇప్పటికే ప్రజా పాల‌న‌లో ఐదు గ్యారంటీల‌కు ప్రజ‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది స‌ర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 25 ల‌క్షల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. వీటిల్లో రుణ‌మాఫీ కోసం సైతం రైతులు భారీగా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారని స‌మాచారం. రుణ‌మాఫీ కోసం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను షార్ట్ లిస్టు చేస్తున్న రేవంత్ స‌ర్కార్ రుణ‌మాఫీ అమ‌లుపై ఫోక‌స్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల్లో రెండు ల‌క్షల రూపాయల రుణ‌మాఫి చేస్తామ‌ని హామీ ఇచ్చింది. దీన్ని అమ‌లు చేయాలంటే.. దాదాపు 30 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమని అధికారుల అంచనా. దీంతో ఎలా ముందుకు వెళ్లాల‌న్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోక‌స్ పెట్టారు.రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే బ్యాంక‌ర్లతో మాట్లాడారని తెలిసింది. ఒకేసారి మొత్తం రుణ‌మాఫీ చేయాల‌ని భావిస్తున్నట్లు స‌మాచారం. దీనికోసం.. రెండు ఆప్షన్లు ఆలోచ‌న‌లో ఉన్నట్లు టాక్. ఒక‌టి.. గ‌తంలో వైఎస్ఆర్ హ‌యాంలో చేసినట్టు ఒకే విడతలో రుణ‌మాఫీ చేయడం. ఇలా చేయాలంటే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ పేరు మీద రుణం తీసుకోవాలి. గ‌తంలో కేసీఆర్ స‌ర్కార్.. కాళేశ్వరం ప్రాజెక్టు, మిష‌న్ భ‌గీర‌థ‌, పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ప్రత్యేక కార్పోరేష‌న్లు ఏర్పాటు చేసి.. బ్యాంకుల నుంచి ఇలాగే రుణాలు తీసుకుంది. ఇదే ఫార్ములాను రుణ‌మాఫీ కోసం అమ‌లు చేయాల‌ని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే.. బ్యాంకులు అప్పులు ఇచ్చే ముందు.. తిరిగి ఎలా తీరుస్తారని అడుగుతాయి. రుణ‌మాఫీ చేస్తే రైతుల నుంచి తిరిగి వసూలు చేసే పరిస్థితి ఉండదు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సెస్‌ల రూపంలో న‌గ‌దును రుణ‌మాఫి కార్పొరేష‌న్‌కు ఇవ్వనుంది. ఇలా చేస్తే బ్యాంకులు కూడా సానుకూలంగా స్పందించే అవ‌కాశం ఉంది. ఇలా రుణం పుడితే 30 వేల కోట్ల రూపాయలను నాలుగేళ్ళల్లో ఈఏంఐల రూపంలో ప్రభుత్వం చెల్లించేలా రేవంత్ స‌ర్కార్ ప్లాన్ చేస్తుంద‌ని సమాచారం. దీంతో ఏక‌కాలంలో రుణ‌మాఫీ చేయ‌డం ఈజీ అవుతుంది. గతంలో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ కోసం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా రుణమాఫీ చేసిన అనుభవాన్ని కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఒకవేళ 30 వేల కోట్ల అప్పు ఏకకాలంలో పుట్టకపోతే అప్పుడు ప్లాన్ బి ని రెడీ చేస్తోందని సమాచారంఇక, గ‌త కేసీఆర్ ప్రభుత్వం ల‌క్ష రుణ‌మాఫీ చేస్తామ‌ని హామి ఇచ్చింది. అయితే అది స‌కాలంలో చేయ‌క‌పోవ‌డంతో పెద్ద ఎత్తున విమ‌ర్శలు వచ్చాయి, రుణ‌మాఫీపై బ్యాంకుల‌కు గ్యారంటీ ఇచ్చి విడ‌త‌ల వారిగా రుణ‌మాఫీ చేసింది. మొత్తం ల‌క్ష రుణ‌మాఫీకి సంబంధించి19 వేల కోట్లు ఉండ‌గా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు ముందు 13 వేల కోట్ల వ‌ర‌కు రుణ‌మాఫీ జరిగింది. ఎస్.ఎల్.బీ.సి. ద్వారా ప్రభుత్వం ప్రత్యేక ప‌ర్యవేక్షణ చేయ‌నందుకు బ్యాంకులు.. ఇష్టారీతిగా రుణ‌మాఫీ చేశాయి. ఒక్కో బ్యాంక్ ఒక్కో తీరున 25 వేల నుంచి 80 వేల వ‌ర‌కు రుణ‌మాఫీ చేశాయి. దీంతో రుణ‌మాఫీ పూర్తి కాక‌పోవ‌డంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేకత‌ను మూటగట్టుకుంది. అదే సమయంలో రైతులపై కొంత వడ్డీ భారం కూడా పడింది. పాత అప్పు తీరకపోవడం వల్ల కొత్త రుణాలు పుట్టకపోవడం వంటి గడ్డుపరిస్థితిని రైతులు ఎదుర్కోవాల్సి వచ్చిందిమరోసారి గ్యారంటీ ద్వారా రుణమాఫీ చేయాల్సిన పరిస్థితే వస్తే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తుందట రేవంత్‌ సర్కార్. రుణమాఫీ మొత్తం అయ్యే వరకు.. వడ్డీని సైతం బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తుందనే గ్యారంటీ కూడా ఇవ్వనుందని సమాచారం. అదే సమయంలో 2 లక్షల వరకు ఉన్న రైతు రుణం బాధ్యత ప్రభుత్వానిదే కాబట్టి.. కొత్త అప్పులకు ఎలాంటి కొర్రీలు పెట్టుకుండా ఆర్బీఐ తోనూ.. కేంద్రంతోనూ చర్చించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి బీఆర్‌ఎస్‌ ఓట‌మికి.. కాంగ్రెస్ గెలుపులో కీల‌కంగా ప‌ని చేసిన‌ రైతు రుణ‌మాఫీకి ఇప్పుడు సీఎం రేవంత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రుణ‌మాఫీని ఏక‌కాలంలో చేసి.. తమది రైతు ప‌క్షపాత ప్రభుత్వంగా ముద్ర వేయించుకోవాలన్న యోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *