సిరా న్యూస్, ఆదిలాబాద్:
కాంగ్రేస్ 420 హామీలపై బుక్లెట్…
– మాజీ మంత్రి జోగు రామన్న
+ డిసెంబర్ 9 హామీలు ఏమయ్యాయని ప్రశ్న
+ పదవులకు రాజీనామ చేయకుండా పార్టీ వీడిన వారిపై ఫైర్
+ బీఆర్ఎస్ ఇచ్చిన పదవులకు రాజీనామ చేయాలని డిమాండ్
+ బీఆర్ఎస్ నేతలను బలవంతంగా కాంగ్రెస్లో లాగుతున్నారని విమర్శ
డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా రూ. 2లక్షల రుణమాపీ, రూ. 15వేల రైతుబంధు ఇస్తామని కాంగ్రేస్ పార్టి హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు రుణమాఫీ, రైతుబంధు ఎందుకు అమలు చేయలేదని మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. మంగళవారం అదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో పాటు అనేక డిక్లరేషన్లతో కలిపి మొత్తం 420 హామీలు ఉన్నాయని, వాటిపై బుక్లెట్ ప్రింట్ చేసామని అన్నారు. త్వరలోనే ప్రజల్లో 420 హామీలను తీసుకెళ్తామని అన్నారు. కాగా అదిలాబాద్లో పలువురు కాంగ్రేస్ నాయకులు బలవంతంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, సర్పంచ్లను కాంగ్రేస్లోకి లాగేందుకు చూస్తున్నారని విమర్శించారు.
పార్టీ వీడిన వారిపై ఫైర్…
బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పదవులకు రాజీనామ చేయకుండా కాంగ్రేస్లోకి చేరిన డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, జైనథ్ జడ్పిటీసీ తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డిలపై ఆయన ఫైర్ అయ్యారు. డీసీసీబీ చైర్మెన్, జడ్పిటీసీ స్థానానికి వెంటనే రాజీనామ చేయాలని డిమాండ్ చేసారు. వారు పార్టీని వీడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ పార్టీని వీడే ముందు పదవులకు రాజీనామ చేయాల్సిందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ వీడాల్సిన పరిస్థితి వస్తే, ఎమ్మెల్యే పదవిని సైతం త్యాగం చేసానని ఆయన గుర్తు చేసారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని, హామీలు అమలు చేయని కాంగ్రేస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన వ్యాఖ్యానించారు.