సిరా న్యూస్,కడప;
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టనున్నారు. వెంటనే అమల్లోకి వచ్చేలా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చీఫ్గా బాధ్యతలు ఇచ్చింది. కుమారుడి పెళ్లి పనుల్లో కాస్త బిజీగా ఉన్న షర్మిల రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. షర్మిల ముందున్న మొదటి టార్గెట్ రాబోయే జమిలీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందన్న నమ్మకాన్ని కలిగించడం. అందు కోసం ప్రభావవంతమైన ఓటు షేర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే ఒక శాతం కన్నా తక్కువ. ఇప్పుడు షర్మిలపై కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్పై ప్రజల్లో అభిమానం వెనక్కి తెచ్చుకోవడం వైఎస్ కుమార్తె మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకోవడం ఇలా అనేక అంశాల ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోందని అనుకోవచ్చు. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ చేయగలిగిందేమీ లేదు. అంతా షర్మిల చేతుల్లోనే ఉంది.ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జీరో పొజిషన్లో ఉంది. ఆ పార్టీ పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఎంత వచ్చినా వచ్చినట్లే. అయితే షర్మిల పరిస్థితి అలా లేదు. కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకుని షర్మిల బలం పుంజుకుంటే ఆమె రాజకీయ జీవితానికి అంత మంచిది. ఇప్పటికే తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టి విఫలమయ్యారు. సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పార్డీని నడిపినా ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పేరుతో పోటీ నుంచి విరమించుకోవడం వ్యూహాత్మక నిర్ణయం. అక్కడ పోటీ చేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఏపీలోకి ఎంట్రీ ఇచ్చినా ప్రభావం ఉండేది కాదు. అక్కడ పోటీ చేయకపోవడం .. కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల షర్మిల ఇమేజ్ తటస్థంగా ఉండిపోయింది. ఇప్పుడు ఆమె సువర్ణావకాశం వచ్చినట్లే. రాజకీయంగా బలోపేతం అవ్వాలనుుకుంటే.. షర్మిలకు కాంగ్రెస్ గొప్ప చాన్స్ ఇచ్చినట్లే. ఏ రాజకీయ పార్టీకి అయినా ఓటు బ్యాంక్ అనేది ఉండాలి. అలా ఉంటేనే ఆ పార్టీ ఎన్నికల రేసులోకి వస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఓటు బ్యాంక్ లేదు. సంప్రదాయ కాంగ్రెస్ వాదులు అందరూ ఇష్టం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ కే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. కారణం కాంగ్రెస్ కు ఓటు వేస్తే నిర్వీర్యం అయిపోతుందన్న ఆలోచనే. వైఎస్ కుమారుడు జగన్ నాయకత్వంలో ఉన్న పార్టీలోనే చాలా మంది కాంగ్రెస్ ను చూసుకుంటున్నారు. కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న వర్గాలన్నీ గుంపగుత్తగా వైఎస్ జగన్ కు మద్దతు పలకడమే దీనికి సంకేతం. ఇప్పుడు వైఎస్ మరో బిడ్డ కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఏపీలో వివిధ కారణాలతో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ను మళ్లీ వెనక్కి తెచ్చుకోవడానికి షర్మిలకు చాన్స్ వచ్చింది. అయితే ఇది అంత తేలికగా జరిగే అవకాశం లేదు. పూర్తి స్థాయిలో షర్మిల నాయకత్వ సామర్థ్యం చూపించి.. కాంగ్రెస్సే మన పార్టీ అందర్నీ నమ్మించగలగాలి. ఏపీలో రాజకీయాలు చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారంటే.. అన్నింటికీ సిద్ధపడి ఉంటారని అనుకోవాలి. తాను తలపడబోయే ప్రత్యర్థుల్లో కుటుంబసభ్యులు ఉంటారు. అంటే.. సొంత సోదరుడు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీతోనే ఆమె ఎక్కువ పోరాటం చేయాలి. ఎందుకంటే ఆ పార్టీ నుంచే ఓటు బ్యాంక్ వెనక్కి రావాల్సి ఉంది. ఇందు కోసం షర్మిల కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చని చెబుతున్నారు. అందులో మొదటిది తాను స్వయంగా కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయడం. ఎక్కడ పోటీ చేసినా ఖచ్చితంగా కుటుంబసభ్యుల మీదుగానే పోటీ చేయాల్సి ఉటుంది. ఇలాంటి సమరం చేయకపోతే రాజకీయాల్లో షర్మిల ప్రయత్నాలు తేలికగా అయిపోతాయి. చేస్తే.. అన్నాచెల్లెళ్ల సవాల్గా మారుతుంది. ఇది రెండు పార్టీల మధ్య క్లాష్ కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మంచి దారి అవుతుంది. ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి లేదా అవినాష్ రెడ్డిపై పోటీ చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకు వచ్చే అవకాశం ఉంది. షర్మిల తీసుకున్న టాస్క్ చిన్నది కాదు. అతి తక్కువ సమయంలోనే తన ప్రభావాన్ని ఏపీలో చూపించాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ మరో నెల.. నెలన్నరలో వస్తుందన్న ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ అయ్యారు. ఆమె మొదటి నుంచి ప్రారంభించారు. గతంలో వైఎస్ పీసీసీ చీఫ్ అయ్యే సమయానికి కాంగ్రెస్ అధికారంలో లేకపోవచ్చు కానీ.. బలమైన పార్టీగా ఉంది. కానీ ఇప్పుడు అదే పార్టీని బలోపేతం చేసి తాను బలోపేతం కావాల్సిన క్లిష్టమైన చాలెంజ్ ను షర్మిల తీసుకున్నారు. ఎంత వరకూ ఈ విషయంలో పలితాలు సాధిస్తారనేది.. ఎన్నికల ఫలితాల తర్వాతే తేలుతుంది. గెలుపోటముల్ని మార్చే అంత ఓటింగ్ శాతం సాధిస్తే.. షర్మిలకు తిరుగులేని రాజకీయ భవిష్యత్ ఉంటుందని అంచనా వేయవచ్చు.