మండపేట,సిరా న్యూస్;
టీడీపీ జనసేన కూటమి ఏర్పడినప్పటి నుంచి మండపేట అసెంబ్లీ నియోజకవర్గం సీటుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. జిల్లాలోనే మండపేటకు ఓ ప్రత్యేక స్థానం ఉండడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతటా ఈ సీటుపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ రెండు పార్టీలు కూడా సీటును ఏ పార్టీ అభ్యర్థికి ప్రకటించినా ఉమ్మడిగానే కలిసి పని చేస్తామని చెప్పినప్పటికీ సీటు కోసం ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేయసాగారు. ఈ నేపథ్యంలో శనివారం మండపేటలో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన ప్రసంగం మధ్యలో మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును ఇక్కడి ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రకటించడంతో సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. మండపేట రా కదలిరా సభావేదిక సాక్షిగా చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు కేరింతలు కొట్టాయి. దీంతో టీడీపీ జనసేన కూటమిలో భాగంగా అదే సభకు హాజరై బాబు పక్క సీట్లో కూర్చొన్న జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ ఒక్కసారిగా ఖంగు తిన్నట్టు అయింది. ఇప్పటివరకు మండపేట సీటు తనదేనని చెప్పు కొచ్చిన లీలాకృష్ణ ముఖం ఢీలా పడ్డట్టయింది. అంతేగాక అదే సభకు హాజరైన లీలాకృష్ణ అభిమానులు, జన సైనికులు కూడా ఆమాట విన్నతర్వాత నిరుత్సాహానికి లోనయ్యారు. సీటు ఎవరికొచ్చినా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఇరువురు నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ మా నాయకుడి కంటే మా నాయకుడికే సీటు అని రెండు పార్టీల్లో కార్యకర్తలు కూడా ప్రచారం చేసుకున్న విషయం విధితమే. అయితే సభలో జోగేశ్వరరావును గెలిపించుకోవాలన్న చంద్రబాబు మాటలు లీలాకృష్ణ అభిమానుల గుండెలు గుబేల్ మనిపించాయి. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ
మండపేట నియోజకవర్గంను తాను 43 ఏళ్ళుగా చూస్తున్నానని ఈ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే ప్రాంతమని మండపేట గొప్పతనాన్ని కొనియాడారు. ఇప్పుడున్న మండపేట నియోజకవర్గం గతంలో ఆలమూరుగా ఉన్నప్పటి నుంచి ప్రశాంత వాతావరణం కలిగిన ప్రాంతంగా ఉందన్నారు. మండపేటలో వేగుళ్ళ జోగేశ్వరరావుకు మూడు సార్లు విజయాన్ని అందించారని గుర్తు చేస్తున్న సమయంలో వెంటనే ఎమ్మెల్యే వేగుళ్ళ సీట్లోంచి లేచి సభలోని వారందరికీ రెండు చేతులు జోడించి నమస్కరించారు. అశాంతితో ఉన్న నియోజకవర్గంలో ప్రశాంత కావాలంటే ఎమ్మెల్యే వేగుళ్లను మళ్ళీ గెలిపించుకోవాలని బాబు కోరారు. రౌడీయిజానికి భయపదో, కులం మతం అని రెచ్చగొట్టినా ఆ కులం మనల్ని కాపాడే పరిస్థితి ఉండదన్నారు. ప్రజలందరినీ కాపాడేది శాంతి, సుపరిపాలన అని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజలకు అభివృద్ది కూడా అవసరమన్నారు. ఇవన్నీ జరగాలంటే టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి పనిచేసి ఎమ్మెల్యే వేగుళ్లను గెలిపించుకు తీరాలని బాబు పిలుపునిచ్చారు