సిరా న్యూస్, చిగురుమామిడి:
అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
–గీకురు రవీందర్ జెడ్పి ఫ్లోర్ లీడర్
రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ అన్నారు. ఈ మేరకు జిల్లా అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ తో కలిసి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేశవపట్నం 24/7 న్యూస్ వాట్సాప్ గ్రూపులో పాకాల విజయేందర్ రెడ్డి, ఫేస్ బుక్ లో మావురపు అశోక్ అనే వ్యక్తులు మంత్రిపై అసభ్య పదజాలంతో, అనుచిత పోస్టులు పెట్టారన్నారు. మంత్రి వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా అసభ్య పోస్టులు పెట్టడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సదరు వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా రంజక పాలనతో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ చూసి కొందరు దుర్మార్గులు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన సిగ్గు లేకుండా పిచ్చి రాతలు, వెర్రి కూతలు వేయడం సమంజసం కాదన్నారు. సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెడితే ఊరుకునేది లేదని, కాంగ్రెస్ శ్రేణులు తిప్పి కొట్టడమే గాక సరైన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో ములుకనూర్, సుందరగిరి గ్రామశాఖల అధ్యక్షులు పూదరి వేణు, ఎనగందుల లక్ష్మణ్, నాయకులు గట్టు ప్రశాంత్, పోటు మల్లారెడ్డి తదితరులున్నారు.