సిరా న్యూస్;
* సెక్యులరిజం నిర్వచనంపైగాని, దాని ఆచరణపై స్పష్టత లేదు
* సమర్థవంతమైన పాలనపై చిత్తశుద్ధి లేదు విధానాలు
*అయోధ్య గురించిన ఎప్పటినుంచో ఉన్న చర్చ
*అందిన ఆహ్వానంపై కాంగ్రెస్ నాయకత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది
ఈ దశాబ్దాల కాలపు నూటొక్క వైఫల్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకు కూడా కోలుకోలేదు. ఇప్పటికీ వారికి సెక్యులరిజం నిర్వచనంపైగాని, దాని ఆచరణపై గాని స్పష్టత లేదు. అందరి అభివృద్ధి, అందరి సంక్షేమం, సమర్థవంతమైన పాలనపై విధానాలు లేవు, చిత్తశుద్ధి లేదు. ఓట్ల కోసం రకరకాల సరికొత్త డ్రామాలు తప్ప. అయోధ్యపై నాయకత్వానిది డైలమా, అస్పష్టత అయితే అదే పార్టీ నాయకులు వేర్వేరు స్వరాలతో మాట్లాడుతుండటం వెనుక ఈ విధమైన దశాబ్దాల వైఫల్యాలు మూల కారణంగా ఉన్నాయి. పార్టీ ప్రస్తుత నాయకత్వం బలహీనమైనది గనుక ఈ చారిత్రక వైఫల్యాలు కాంగ్రెస్ను భవిష్యత్తులోనూ వెంటాడుతూనే ఉంటాయి.
అయోధ్య గురించిన చర్చ ఎప్పటినుంచో ఉన్నదే అయినా, తమకు అందిన ఆహ్వానంపై కాంగ్రెస్ నాయకత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. దానినిబట్టే ఈ విషయమై పార్టీకి ఒక డైలమా ఎదురైనట్టు అందరికీ అర్థమైంది. కాంగ్రెస్ తనను తాను సెక్యులర్గా ప్రకటించుకున్నందున వాస్తవానికి ఎటువంటి డైలమా ఉండకూడదు. అయోధ్య ఆహ్వానం రాగలదన్నది ముందే తెలిసిన విషయమైనప్పుడు, నిర్ణయం కూడా ఎంతో ముందుగానే తీసుకొని ఉండవలసింది. కానీ, ఆ పని ఎందుకు చేయలేకపోయింది? చివరికి, తాము రామునికి గాని, ఆలయానికి గాని వ్యతిరేకం కాదని, ఆ కార్యక్రమాన్ని బీజేపీ ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చినందున, వచ్చే లోక్సభ ఎన్నికల్లో లాభపడజూస్తున్నందున, ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నామని వివరించబూనింది.