జయజయహే తెలంగాణ

 సిరా న్యూస్,హైదరాబాద్;
ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు తెలంగాణ కనువిందు చేసేందుకు సిద్ధమవుతుంది. దాదాపు మూడేళ్ల తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకోవడంతో తెలంగాణ శకటం గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు రాబోతోంది. ‘జయ జయహే తెలంగాణ’ అని శకటానికి పేరు పెట్టారు. ప్రజాకవి అందెశ్రీ రాసిన ఈ పాట తెలంగాణ ఉద్యమం సమయంలో మరింత జోష్ నింపింది. సుమారు మూడేళ్ల తర్వాత తెలంగాణ శకటం గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు రాబోతుండటంతో థీమ్ కూడా ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈనెల 26న ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్తవ్య్‌పథ్‌లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా తెలంగాణ శకటాన్ని ప్రదర్శించబోతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కేవలం 2015, 2020 సంవత్సరాల్లో మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొంది. ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడే దిశగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన సంగతి తెలిసిందే. ఈ పోరాటం.. దేశ ప్రజాస్వామ పరిరక్షణలో భాగమనే చరిత్రను శకటం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.ఉద్యమ నేపథ్యం నుంచి అభివృద్ధి వైపు తెలంగాణ ఎలా అడుగులు వేస్తుందో కూడా శకటం ద్వారా సర్కారు చూపించనున్నారు. ఆనాటి నిరంకుశ పాలన, తెలంగాణ ఆడ బిడ్డలకు జరిగిన అవమానాల గాథల నుంచి స్వరాష్ట్రం కోసం పుట్టిన ఉద్యమ తీరును దేశ ప్రజల కళ్లకు కట్టేలా తెలంగాణ శకటాన్ని సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. శకటంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తిన పోరాట యోధులైన కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఢిల్లీలో రానున్న రెండేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర శకటం ప్రదర్శన ఉండనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *