సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో ఎన్నికల మూడ్ నెలకొంది. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఏప్రిల్ 16న ఏపీలో ఎన్నికల పోలింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫ్రీ పోల్ సర్వేలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. అందులో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. మూడ్ ఆఫ్ ఏపీ సర్వేను పాపులర్ ఫ్రీ పోల్ సర్వే పేరిట ఒక సంస్థ వెలుగులోకి తెచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని సదరు సంస్థ వెల్లడించింది. కానీ పార్లమెంటు స్థానాల వరకే సర్వే ఫలితాలు వెల్లడించడం విశేషం.ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పది ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. అటు టిడిపి, జనసేన కూటమికి 9 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. మరో ఆరు స్థానాల్లో హోరాహోరీ ఫైట్ నడుస్తుందని స్పష్టం చేసింది. ఈ సర్వే లెక్కన ఏపీలో గట్టి ఫైట్ ఉంటుందని తేలింది. వైసీపీకి సంబంధించి విజయనగరం, అరకు, అమలాపురం, ఏలూరు, కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, నంద్యాల పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. టిడిపి, జనసేన కూటమి గెలుచుకునే సీట్లు పరిశీలిస్తే.. శ్రీకాకుళం, విశాఖపట్నం,అనకాపల్లి, నరసరావుపేట, బాపట్ల,నరసాపురం, కాకినాడ,కర్నూలు, హిందూపూరం పార్లమెంట్ స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఉంది.రాజమండ్రి, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో గట్టి ఫైట్ నడుస్తుందని సర్వే తేల్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆసక్తికరమైన సర్వేగా తేలుతోంది. ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన వైసీపీకి 70 సీట్లు, టిడిపి జనసేన కూటమికి 63 అసెంబ్లీ సీట్లు రావచ్చని సర్వే ప్రకారం తేలుతోంది. ఇక 6 పార్లమెంట్ స్థానాల పరిధిలోని 42 అసెంబ్లీ స్థానాల్లో పోటి హోరాహోరీగా నడవనుంది. ఇందులో మెజారిటీ స్థానాలు ఎవరు దక్కించుకుంటే వారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఈ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమిలోకి బిజెపి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్, పోలింగ్ కు సమయం ఉండడంతో గెలుపు అవకాశాలు మారే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.