సిరా న్యూస్;
బీహార్ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. బీహార్లో మహ కూటమి సర్కార్ ఏ క్షణంలోనైనా కుప్పకులే అవకాశాలు కన్పిస్తున్నాయి. కూటమి నుంచి బయటకు వచ్చేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెడీ అయ్యారు. భారతరత్న కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా నితీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఆర్జేడీ, లూలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు నితీష్ కుమార్. ఈక్రమంలోనే జనవరి 30వ తేదీన రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్లో ప్రవేశిస్తుంది. ఈ యాత్రకు తాను హాజరుకావడం లేదని నితీష్ ఇప్పటికే ప్రకటించారు.బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆశ్రిత పక్షపాతం అంటూ కామెంట్ చేయడం బీహార్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. లాలూ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), నితీశ్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) మధ్య టెన్షన్ మొదలైంది. జనవరి 25న జరిగిన నితీష్ కుమార్ కేబినెట్ సమావేశంలోనూ దాని ప్రభావం కనిపించింది. కొద్దిసేపటికే సమావేశం ముగియగా, అనంతరం జరగాల్సిన విలేకరుల సమావేశం కూడా రద్దయింది. అనంతరం నేరుగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిశారు సీఎం నితీశ్. ఈ సమావేశం తర్వాత నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ లోక్సభ ఎన్నికలలోపు నితీష్ కుమార్ ఎన్డీయేలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.ఈ ఊహాగానాలకు స్వస్తి పలికేందుకు, బీహార్ ప్రభుత్వంలో అంతా బాగానే ఉందని సీఎం నితీశ్ రాజకీయ సలహాదారు కేసీ త్యాగి వివిధ మీడియా ఛానెల్లకు ఇచ్చిన ప్రకటనలో తెలిపారు. అంతే కాదు గవర్నర్-సీఎం భేటీని మర్యాదపూర్వక భేటీగా అభివర్ణించారు. ఇప్పుడు కేసీయార్ త్యాగి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ, ఒక వాస్తవం ఏమిటంటే, గత కొన్ని రోజులుగా నితీష్ కుమార్ పట్ల భారతీయ జనతా పార్టీ నాయకుల స్వరం మారింది. ఇదొక్కటే కాదు జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ సహా అన్ని పార్టీలు వరుస సమావేశాలు జరుగుతుండటం నితీశ్ కుమార్ ఇండియా కూటమి వీడుతున్నారన్న వార్తలకు బలం చేకూరుస్తోంది.ఇక తాజాగా భారతరత్న కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యల మరింత అజ్యం పోశాయి. కుటుంబ వాదంపై విమర్శలు గుప్పించిన నితీశ్ కుమార్.. మాజీ సీఎం లాలూ కుటుంబాన్ని పరోక్షంగా టార్గెట్ చేశారు. కర్పూరి ఠాకూర్ లాగే తాను కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్నారు నితీష్కుమార్. అంతేకాదు కొందరు నేతలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని పరోక్షంగా లాలూపై విమర్శలు చేశారు. ఈ రోజుల్లో, ప్రజలు తమ కుటుంబాలను ముందుకు తీసుకువెళతారు. కానీ కర్పూరి జీ ఎప్పుడూ అలా చేయలేదు. జననాయక్ నుండి నేర్చుకుని, మేము కూడా మా కుటుంబాన్ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లలేదు. కర్పూరి జీ నిష్క్రమణ తర్వాత, మేము అతని కుమారుడు రామ్నాథ్ ఠాకూర్ను ముందుకు తీసుకెళ్లాము. ఎవరు ఏమి చెప్పినా, చెబుతూ ఉండండి.” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం నితీశ్ కుమార్.బీహార్ ముఖ్యమంత్రిగా, భారత కూటమిని ప్రారంభించిన నేతల్లో ఒకరైన నితీశ్కు ఈ కూటమిలో కన్వీనర్ పదవి గానీ, ప్రధాని అభ్యర్థిత్వానికి అవకాశం గానీ రాలేదు.