రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పథకాల అమలులో ముందజలో ఉంటాం

కమిషనర్ రోనాల్డ్ రోస్
జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
 సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పథకాల అమలులో రాష్ట్రంలో ముందజలో ఉంటామని కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి పోలీసు వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వివిధ విభాగాల హెచ్.ఓ.డి లు గా పనిచేస్తున్న ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారని, ఆ పోరాటంలో అసువులు బాసిన వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు….మహాత్మాగాంధీ, జవహర్ నెహ్రూ, దాదాబాయ్ నౌరోజి, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్ మరెందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామని, భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిన గణతంత్ర రాజ్యంగా అవతరించిన నేటి రోజున గ్రేటర్ హైదరాబాద్ నగరం లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరించడం నా బాధ్యత గా భావిస్తున్నానని తెలిపారు.
నగర ప్రజలకు అవసరమైన సౌకర్యాల కోసం చేసిన అభివృద్ధి పనులు అందుబాటులోకి తేవడం జరిగిందని, గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ సాధించుకున్న తర్వాతే నగరంలో ఆధునిక పద్దతిలో అనూహ్య వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సారథ్యంలో నగర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, ముఖ్యమంత్రి సూచనలు, సలహాల మేరకు వినూత్న వ్యూహాత్మక పథకాల రూపకల్పన చేసి నగర వాసులకు ఇబ్బందులను తగ్గించేందుకు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, సామాజిక ఆర్థిక పథకాల అమలుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన నగరాలకు దీటుగా ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేసి దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్ర రాజధాని నగరంగా కీర్తి ప్రతిష్టలు తేవాలనే సంకల్పంతో ముందుకు పోతున్న తరుణంలో అందుకు మనమందరం పూర్తి సహకారం అందించాలని కోరారు.
సాధారణ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగిందని, అందుకు అధికారులు విశేష కృషి, ప్రజల సహకారం తో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.
నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా పాలన అందించాలనే సంకల్పంతో డిసెంబర్ 28 నుండి జనవరి 6 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారని, ఈ తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా 5 గ్యారంటీలు అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వార్డు వారీగా ఒక్కొక్క లొకేషన్ లో 4 కౌంటర్లను ఏర్పాటు చేసి కౌంటర్ వద్దకు వచ్చిన ప్రతి దరఖాస్తును స్వీకరించడం జరిగిందని తెలిపారు. అభయహస్తం దరఖాస్తు లతో పాటుగా ఇతర వ్యక్తిగత సమస్యల పై వచ్చిన 5.73 వేల విన్నపాలను కూడా స్వీకరించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *