తాజా మాజీలపై విచారణ….

సిరా న్యూస్,హైదరాబాద్;
టీఎస్ పీఎస్సీ  పేపర్స్ లీకేజీతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు ఉద్యోగులను అరెస్ట్ చేయగా.. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు రాజీనామా చేసిన గత బోర్డుపైనా విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కమిషన్ కు సంబంధించి పదవులకు ఛైర్మన్, నలుగురు సభ్యులు రాజీనామా చేయగా.. వారి రాజీనామాలను ఆమోదించే సమయంలో గవర్నర్ తమిళిసై  కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి సిట్ దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించాలని.. బాధ్యులెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే టీఎస్ పీఎస్సీ సభ్యులపై విచారణ అంశం మరోసారి తెరపైకి వచ్చినట్లు సమాచారం.
అలాగే, గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొని ఇంకా రాజీనామా చేయని అరుణకుమారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 2010లో అప్పటి రంగారెడ్డిజిల్లా జేసీగా పని చేసిన జగన్మోహన్ పై అనిశా ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసింది. ఆయన భార్య అరుణకుమారి అప్పట్లే స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ గా పని చేస్తుండగా.. ఆమెపై కూడా కేసు నమోదైంది. అయితే, వీరిపై చట్టపరమైన చర్యలకు బదులు భారీ జరిమానా సరిపోతుందని.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2013లో ఉత్తర్వులు ఇచ్చింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుని ఆ వివరాలు అనిశాకు పంపాల్సి ఉంది. కాగా, వీరిపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఎలాంటి వివరాలు తమకు అందలేదని.. ఆ నివేదిక తమకు పంపాలని అనిశా 2020లో తెలంగాణ సీఎస్ కు లేఖ రాసింది. అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉండగా.. తాజాగా ఈ కేసుకు సంబంధించి సర్కారు దృష్టి సారించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *