ఏపీలో ఎన్నికల ప్రక్షాళన

 సిరా న్యూస్,తిరుపతి;
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చిలో నోటిఫికేషన్ వెల్లడించడంతో పాటు ఏప్రిల్ లో పోలింగ్ పెట్టేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సన్నాహాల్లో కీలకమైన అధికారుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐఏఎస్ లను 92 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేయడంతో పాటు పలుచోట్ల పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది.ఇలా బదిలీ అయిన వారిలో మున్సిపల్ కమిషనర్లు, అదనపు కమిషనర్ కూడా ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వీరిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకే చోట మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు, వచ్చే జూన్ 30 నాటికి మూడేళ్లు సర్వీస్ పూర్తయ్యే వారిని బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకు వీరిని బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు ఈ బదిలీలు జరిగాయని తెలుస్తోంది.చాలామంది మున్సిపల్ కమిషనర్లు సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. అటువంటివారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎలక్షన్ కమిషన్ ఏ అధికారిని సొంత జిల్లాలో ఉండకుండా చూడాలని భావిస్తోంది. అందుకే ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత నాలుగేళ్లలో మూడేళ్లపాటు ఒకే చోట పని చేసిన వారికి సైతం స్థానచలనం కల్పించింది. క్రమశిక్షణ చర్యలు పెండింగ్ లో లేని అధికారులను మాత్రమే బదిలీ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఆరు నెలల్లో రిటైర్మెంట్ కాని వారిని మాత్రమే బదిలీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలోనే త్వరలో రెవెన్యూఅధికారుల బదిలీలు ఉంటాయని.. పోలీసు ఉన్నతాధికారులు సైతం బదిలీ అవుతారని సమాచారం. ఈ నెల రోజుల వ్యవధిలో అన్ని శాఖల అధికారుల బదిలీ ప్రక్రియ పూర్తి కావాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *