సిరా న్యూస్;
దేశమంతటి దృష్టి ఇప్పుడు ఫిబ్రవరి గురువారంపైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎన్నో ఆశలు, పేదలకు వరాలు, పన్ను చెల్లింపుదారులకు ఊరట, పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా మన నిర్మలమ్మ చేతుల్లోనే ఉంది. ఈ ఏడాది వరుసగా ఆరోసారి నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరికొద్ది నెలల్లో దేశం ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఈసారి ఆమె మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ అవసరమైన ఖర్చుల కోసం ప్రకటించేదే మధ్యంతర బడ్జెట్. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రజల ముందుకు తీసుకువస్తారు.1947 నుంచి చూస్తే.. ఒక్కో ఏడాది ఒక్కో బడ్జెట్ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంవైపు నడిపేలా అప్పటి ఆర్థిక మంత్రులు ప్రణాళికలు రచించారు. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడేలా.. దేశం వృద్ధి వైపు పరుగులు తీసేలా పలువురు విత్త మంత్రులు చేసిన కృషి అభినందనీయం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకూ భారతదేశ పద్దు ముఖచిత్రంలో కొన్ని కీలక ఘట్టాలను ఓసారి చూస్తే..1947 – 48 ఆర్థిక ఏడాదికి సంబంధించి భారత ఆర్థిక మంత్రి ఆర్.కే.షణ్ముఖం చెట్టి 1947, నవంబర్ 26న దేశ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ కింద రూ.197.39 కోట్లు కేటాయించగా.. ఇందులో దాదాపు రూ.92.74 కోట్లు అంటే సుమారు 46 శాతం రక్షణ సేవల కోసం కేటాయించబడింది. 1948లో తొలిసారిగా ఆర్థిక మంత్రి ‘మధ్యంతర బడ్జెట్’ అనే పదాన్ని ఉపయోగించారు. దీంతో తర్వాత ఇదే ఆనవాయితీగా.. మధ్యంతర బడ్జెట్ అనే ప్రక్రియ కొనసాగింది.1949 -50లో భారత ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తై బడ్జెట్ సమర్పించగా.. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రద్దు చేసింది. అయితే, ఇది తర్వాత 1956 – 57 బడ్జెట్ సమయంలో పునరుద్ధరించారు. ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్రణాళికా సంఘం ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 1950 -51 బడ్జెట్ లో ప్రకటించింది. దేశ అభివృద్ధికి అవసరమైన కార్యకమాలను ఈ ప్రణాళికా సంఘం రూపొందించింది.ఇక 1951-52 ఏడాది బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి చింతామన్ ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించారు. ఈ బడ్జెట్ లో మొత్తం ఆదాయం అంచనా రూ.369.89 కోట్లుగా ఉండగా.. వ్యయం రూ.375.43 కోట్లు ఉంది. రూ.5.54 కోట్ల లోటును మిగిల్చింది. ఆ తర్వాత ఏడాది కూడా బడ్జెట్ లోటు రూ.75.6 కోట్లుగా అంచనా వేయబడింది. ఆ తర్వాత ఏడాది బడ్జెట్ లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కనీస ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని మునుపటి రూ.3,600 నుంచి రూ.4,200 (సుమారు 17 శాతం) వరకు పెంచారు.1955-56 ఏడాదికి ద్వారకానాథ్ దేశ్ ముఖ్ సమర్పించిన బడ్జెట్ లో వివాహం అయిన వారికి, వివాహం కాని వ్యక్తులకు వేర్వేరుగా పన్ను మినహాయింపు పరిమితులను ప్రతిపాదించారు. పెళ్లైన జంటలకు రూ.2,000, పెళ్లి కాని వ్యక్తులకు రూ.1,000 పరిమితిని కొనసాగించారు. ఆ తర్వాత ఏడాది మొత్తం బడ్జెట్ రూ.545.43 కోట్లు ప్రతిపాదించగా.. రక్షణ సేవలకు రూ.203.97 కోట్లు, సివిల్ హెడ్ లకు రూ.341.46 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ ను ఇంగ్లీష్ తో పాటు హిందీలోనూ ముద్రించారు.1957 – 58లో భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి కేంద్ర బడ్జెట్ ప్రకటించగా.. కొత్తగా వెల్త్ ట్యాక్స్ ఆవిష్కరించింది. ఇది ఓ కొత్త పన్నుల ప్రత్యక్ష విధానంగా కొనసాగింది.1958 – 59లో కేంద్ర బడ్జెట్ ను ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ సమర్పించారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఓ ప్రధాని బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధాని బడ్జెట్ సమర్పించే బాధ్యతలు నిర్వర్తించాలని నిర్ణయించుకున్నారు. ఈ బడ్జెట్ లోనే గిఫ్ట్ ట్యాక్స్ అనే కొత్త పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టారు. అటు తర్వాత 1960 – 61లో భారత ఆర్థిక మంత్రి మొరార్జీ ఆర్.దేశాయ్ బడ్జెట్ సమర్పించగా.. ఇందులో USAతో దిగుమతి ఒప్పందం అయిన ‘PL480’ కోసం ప్రభుత్వం అంచనాలను విడుదల చేసింది. 1959లో సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం, ఆ సమయంలో రూ.122 కోట్ల విలువైన ఆహార ధాన్యాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి US ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.1965-66 ఏడాదికి కేంద్ర బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి సమర్పించారు. ఈ బడ్జెట్ లో నల్లధనంపై వ్యతిరేకంగా తొలి అడుగు పడింది. ప్రభుత్వం లెక్కల్లో లేని సంపద కోసం స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని ఇందులో ప్రారంభించింది. దేశంలో నల్లధనం, పన్ను ఎగవేత వంటి వాటిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నం ఇదే. ఆ తర్వాతి సంవత్సరాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ల్లో ‘స్పౌజ్ అలవెన్స్’ అనే విధానం రద్దు, కొత్త పారిశ్రామిక సంస్థలు, నౌకలకు పన్ను సెలవు రాయితీని పొడిగిస్తూ ఆర్థిక మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.1973-74లో బడ్జెట్ ను భారత ఆర్థిక మంత్రి యశ్వంతరావు చవాన్ సమర్పించారు. ఈ ఏడాది ఆర్థిక లోటు రూ.550 కోట్లుగా ఉండగా.. ఈ బడ్జెట్ ను ‘బ్లాక్ బడ్జెట్’ అని పిలుస్తారు. భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయం అది. ఆ తర్వాత ఏడాది దేశ ఆదాయపు పన్ను వ్యవస్థ పునర్నిర్మాణానికి వేదికను సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా, గరిష్ట ఉపాంత ఆదాయపు పన్ను రేటును 97.75 శాతం నుంచి 75 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.2023-24లో నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ‘అమృత్ కాల్’ వృద్ధిపై దృష్టి సారించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఈ బడ్జెట్ లో పలు అంశాలను పొందుపరిచారు. ఈ బడ్జెట్ కు ‘అభివృద్ధికి సప్తబుుషి’, లేదా ‘అభివృద్ధికి ఏడు స్తంభాలు’ అనే పేరు పెట్టారు. అందులో సమ్మిళిత వృద్ధి, అభివృద్ధిలో చివరి మైలుకు చేరుకోవడం, మౌలిక సదుపాయాల పెట్టుబడి, హరిత వృద్ధి, యువశక్తి, పూర్తి స్థాయిలో సామర్థ్యాలను వాడుకోవడం వంటి వాటిని సూచిస్తుంది. అలాగే, ఈ బడ్జెట్ లో భారతీయ రైల్వేలకు రికార్డు స్థాయిలో రూ.2.4 ట్రిలియన్ల బడ్జెట్ కేటాయింపులు చేశారు.మరి, 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. మరి ఈసారి ఎవరికి వరాలిస్తారో.? ఎవరికి కోతలు పెడతారో.? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.