జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ.

న్యూఢిల్లీ, (సిరా న్యూస్);
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. శుక్రవారం జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.  జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నారని, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ఇచ్చిన రిప్లై ఆధారంగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును రఘురామ సుప్రీంలో సవాలు చేశారు.గత విచారణలో  ఏపీ సీఎం జగన్ కేసులో విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రఘురామ వేసిన బదిలీ పిటిషన్ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.   విచారణ సందర్భంగా సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులుగా ఉన్న అరబిందో, హెటిరో గ్రూప్, డ్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.నిత్యానంద రెడ్డి, పి.శరత్ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, యద్దనపూడి విజయలక్ష్మి, పీఎస్ చంద్రమౌళి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థలకు నోటీసులిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *