ల్యాప్ టాప్ బాయ్ నుంచి బయిట పడేదేలా
సిరా న్యూస్,విజయవాడ;
రాజకీయాల్లో దూకుడుతోపాటు అనుభవానికి కూడా పెద్దపీట వేస్తేనే రాణించగలుగుతారు. సీనియర్లు పాత చింతకాయ పచ్చడి లాంటి వారని పక్కనపెడుతూ పూర్తిగా యువతకే ప్రాధాన్యత ఇస్తే కొత్త చింతకాయ పచ్చడితో ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. ఈ పచ్చడి ఉదాహరణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సరిగ్గా సరిపోతుంది. తనది నలభై ఏండ్ల రాజకీయ అనుభవమని నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెబుతుంటారు. అయితే టీడీపీలో మాత్రం ప్రస్తుతం అనుభవం కన్నా యువనేత నారా లోకేశ్ పెత్తనమే సాగుతోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉంటూ కష్టకాలంలోనూ చేదోడుగా ఉన్న సీనియర్లను కొత్త రక్తం పేరుతో యువనేత లోకేశ్ పక్కన పెడుతున్నారు. పార్టీ అభ్యర్థుల బయోడేటా కంటే వారి ఆర్థిక బ్యాలెన్స్ షీట్లకే లోకేశ్ అధిక ప్రాధాన్యతిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని విస్మరిస్తూ డబ్బు సంచులతో వచ్చే ప్యారాచూట్లనే బరిలోకి దింపుతున్నారు.పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు టికెట్ల కేటాయింపులో విద్యావంతులకు, సామాజికవేత్తలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతిస్తే అదే పార్టీలో ఇప్పుడు దానికి భిన్నంగా ప్రస్తుతం ఆయన మనుమడు నారా లోకేశ్ మాత్రం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీ సీనియర్లే చెబుతున్నారు. పార్టీకి నాయకులు చేసిన సేవ, ప్రజసేవ కంటే ఎన్నికల్లో వారెంత ఖర్చు పెట్టగలరు..? పార్టీకి వారు ఎన్ని నిధులు ఇవ్వగలరు..? అనే ఆర్థికాంశాలకే లోకేశ్ కోటరీ పెద్దపీట వేస్తోంది.తెలుగుదేశం వ్యవహారాలన్నీ ఇప్పుడు లోకేశ్ చుట్టే తిరుగుతున్న దశలో యువనేత అరంగేట్రమే ఆసక్తికరం. 2014 ఎన్నికల ముందు తెరవెనుక ఉన్న నారా లోకేశ్ టీడీపీ అధికార పగ్గాలు చేపట్టాక తెర ముందుకు వచ్చారు. లోకేశ్ సొంత సామాజిక వర్గం వారితో కూడిన భజనపరులను తన చుట్టూ చేర్చుకొని ఒక కోటరీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టాక ప్రభుత్వంలో, పార్టీలో కోటరీ జోక్యం పెరిగిపోయింది. ఆ కోటరీ వ్యవహారంతో పార్టీ అభివృద్ధి కంటే పతనావస్థకి దిగజారుతోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను విస్మరించి లోకేశ్ అండ్ కో తమ అభిప్రాయాలే ప్రతిధ్వనించేలా ‘ఎకోఛేంబర్’కే పరిమితమై నిర్ణయాలను తీసుకుంటోంది.రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని వారు ల్యాప్టాప్లు పెట్టుకొని వ్యూహకర్తలు అనే పేరుతో సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతలకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు కూడా తెలియని వారు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఏ మండలం ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందో, ఏ నియోజకవర్గం ఏ జిల్లాలోకి వస్తుందో కూడా తెలియని వ్యూహకర్తల కబంధ హస్తాల్లో పార్టీ చిక్కుకుంది. కనీసం విద్యార్థి సంఘం నాయకులుగా కూడా పనిచేయని వారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ పదవుల మధ్య తేడాలు కూడా తెలియని వారు, పూర్తిగా రాజకీయ అనుభవరాహిత్యం వారితో ఉన్న ఈ కోటరీ సలహాలు తీసుకోవాల్సిన దుస్థితి పార్టీ సీనియర్లకు ఏర్పడింది.నారా లోకేశ్పై ఈ ‘ల్యాప్టాప్ బాయ్స్’ కోటరీ ప్రభావం ఎంతుందో చెప్పడానికి యువనేత చేసిన యువగళం పాదయాత్రే నిదర్శనం. లోకేశ్ పాదయాత్రతో ప్రజల మనస్సులను గెల్చుకోవడం కంటే దీన్ని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్లా నిర్వహించడానికే ఈ కోటరీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. పాదయాత్రలో ప్రజలను నేరుగా కలుసుకొని వారి కష్టాలను తెలుసుకునే అవకాశాలుంటే, అందుకు భిన్నంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యువగళాన్ని ఒక సినిమా కార్యక్రమంలా నిర్వహించారు. సెల్ఫీలు, డ్రోన్లకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఇవ్వలేదు. ఈ కోటరీ ఆర్భాటంతో యువగళం ఆయా నియోజకవర్గాల్లో ప్రవేశిస్తున్న సమయంలో నిజమైన పార్టీ కార్యకర్తలకు, నేతలకు గుర్తింపు లభించలేదు. పాదయాత్ర సందర్భంగా భారీగా ఖర్చు పెట్టిన వారికే లోకేశ్ కోటరీ ప్రాధాన్యత ఇవ్వడంతో తెలుగుదేశం టికెట్ల కోసం వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు క్యూ కట్టారు.తెలుగునాట గతంలో నిర్వహించిన రాజకీయ నేతల పాదయాత్రలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. వైఎస్.రాజశేఖర రెడ్డి ‘ప్రజా ప్రస్థానం’, నారా చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీ కోసం’, వైఎస్.జగన్మోహన్రెడ్డి ‘ప్రజా సంకల్ప’ పాదయాత్రలతో వారు అధికారం చేపట్టడమే కాకుండా, దీన్ని వారు రాజకీయ భవిష్యత్తుకు మార్గదర్శకంగా మల్చుకున్నారు.