సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు రాజకీయంగా కాక రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్ పదవీకాలం ముగియనుంది. వీరిస్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంది. ఫిబ్రవరిలోనే ఎన్నికలు పెట్టేస్తున్నారు. షెడ్యూల్ విడుదలయింది. ఇప్పుడు ఉన్న బలాబలాల ప్రకారం అయితే కాంగ్రెస్ కు రెండు సీట్లు ఖాయం. బీఆర్ఎస్ ఒకటి వస్తుంది. కానీ కాంగ్రెస్ మూడో స్థానానికి పోటీ పెడితే మాత్రం బీఆర్ఎస్ కఠిన పరీక్షన ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలంగాణలో రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కొక్కరికి నలభై మంది మద్దతు తెలిపితే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో కలిసి 65 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి ఏడుగురు ఉన్నారు. రాజ్యసభ బరిలో ఒక అభ్యర్థిని బరిలోకి దింపడానికి 10 మంది శాసనసభ్యులు ఆయన పేరును ప్రతిపాదించాలి. బీజేపీ, మజ్లిస్ పోటీ చేసే అవకాశం ఉండదు. బీజేపీ పోటీ చేయదు.. అలాగని అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థులకు కానీ మద్దతుగా ఓటేసే అవకాశం ఉండదు. మజ్లిస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. సాధారణంగా మజ్లిస్ అధికారంలో ఉన్న పార్టీకే మద్దతుగా ఉంటుంది. అధికార పార్టీతో గొడవలు పెట్టుకోదు. అంతగా కావాలంటే ఎన్నికలను బహిష్కరించవచ్చు. కానీ ఇటీవల రేవంత్ రెడ్డితో అక్బరుద్దీన్ దగ్గర సంబందాలు మెయిన్టెయిన్ చేస్తున్నారు. కాంగ్రెస్ కే మజ్లిస్ మద్దతు తెలిపినా ఆశ్చర్యం లేదు. మూడో అభ్యర్థిగా మైనార్టీ అభ్యర్థిని నిలబెడితే తప్పక మద్దతివ్వొచ్చు. ఒక వేళ ఓటింగ్ బహిష్కరించినా కాంగ్రెస్ కు లాభమే. ఓటింగ్ అయినా బహిష్కరిస్తుంది కానీ బీఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేసేంత సాహసం చేయదు. బీజేపీ, మజ్లిస్ ఈ రెండు పార్టీలకు చెందిన 15 మందిని లెక్కలోంచి తీసేస్తే.. 104 మంది సభ్యుల ప్రకారం చూస్తే.. ఒక్కొక్కరి 35 మంది అభ్యర్థులు సరిపోతారు. ఈ లెక్కన బీఆర్ఎస్కు ఒకటి ఖాయం. పోటీ ఉండదు కాబట్టి మిగిలిన రెండూ కాంగ్రెస్కు ఖాయం.రాజ్యసభ ఎన్నికల్లో పోలైన ఓట్లలో గెలవడానికి ఓ అభ్యర్థి నిర్దిష్ట సంఖ్యలో మొదటి ప్రాధాన్యత ఓట్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. ముగ్గురు అభ్యర్థులకు నలుగురు పోటీలో ఉండి.. వంద మంది ఓట్లేస్తే మొదటి రౌండ్ పోల్స్లో, ప్రతి మొదటి ప్రాధాన్యత ఓటు విలువ 100 పాయింట్లుగా నిర్ణయిస్తారు. అభ్యర్థి ఓటు వేసిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను ఎన్నికలు జరిగే సీట్ల సంఖ్యతో డివైడ్ చేయడం ద్వారా పొందిన కోటీన్ కంటే ఒక పాయింట్ ఎక్కువ సాధించాలి. కౌంటింగ్ తర్వాత ఎవరికి ఎక్కవ పాయింట్లు వస్తాయో ఆ ముగ్గిరినే విజేతగా ప్రకటిస్తారు.మూడు స్థానాలు ఖాళీ అవుతున్నందున ముగ్గురే అభ్యర్థులు బరిలో నిలిస్తే పోలింగుతో, సంఖ్యాబలంతో సంబంధం లేకుండా వారి ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ముగ్గురికి మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగ్ అనివార్యమవుతుంది. అప్పుడు మొదటి మూడు స్థానాల్లో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. కాంగ్రెస్కు ఒక స్థానం గెలిచే ఓట్ల కంటే మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది. బీఆర్ఎస్కు ఒక స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో ఆరు ఓట్లే ఉన్నందున అది రెండోస్థానానికి పోటీ చేసే వీలు ఉండదు. ఈ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ రెండు, బీఆర్ఎస్ ఒక స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మూడు స్థానాలకు పోటీ చేసినా బీఆర్ఎస్ రెండు స్థానాలకు పోటీ చేసినా ఎన్నికలు ఉత్కంఠగా మారుతాయి.