బొత్స నుంచి అయ్యన్న కుమారుడి వరకు
సిరా న్యూస్,విశాఖపట్టణం;
ఉత్తరాంధ్రలోని పలు పార్టీల్లో కీలక నేతలుగా ఎదిగిన నాయకులు తమ వారసుల రాజకీయ భవితవ్యంపై మథనపడుతున్నారు. గడిచిన 20, 30 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తూ.. అనేకసార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేసని ముఖ్యమైన నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రాజకీయ రంగప్రవేశం చేయించి.. శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావించారు. అందుకు అనుగుణంగా గ్రౌండ్ను చాలా మంది నాయకులు ప్రిపేర్ చేశారు. కానీ, ఆయా నేతలకు పార్టీ అధిష్టానం నుంచి వారసుల రాజకీయ రంగ ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో మరోసారి పోటీ చేయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. వారసులను రంగ ప్రవేశం చేయించాలనుకునే వారి జాబితాలో వైసీపీతోపాటు టీడీపీలోనూ ఎక్కువగానే ఉంది. పార్టీ అధినాయకత్వ సూచనలతో సీనియర్ నేతలే మరోసారి బరిలోకి దిగాల్సి వస్తుండడంతో వారుసలకు మరికొంత కాలం నిరీక్షణ తప్పని పరిస్థితి ఏర్పడింది. వారుసుల రాజకీయ రంగప్రవేశం చేయించాలని భావించిన నాయకులు జాబితాలో సీనియర్ మంత్రి, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో రాజకీయ వారుసుడిని బరిలోకి దించాలని ఆయన ముందు నుంచీ భావిస్తూ వచ్చారు. ఇందుకోసం చాలా కాలం కిందటి నుంచే ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. మాజీ ఎంపీ, తాజా విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, మంత్సి బొత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్ బొత్స సందీప్ను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారు. డాక్టర్ బొత్స సందీప్ కూడా గత కొన్నాళ్లు నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు, సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ, అనూహ్యంగా వైసీపీ అధిష్టానం బొత్స సందీప్ పోటీకి క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈసారి కూడా బొత్స సత్యనారాయణ దంపతులు బరిలో ఉండాలని సీఎం జగన్ బలంగా ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగానే వారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంతో సందీప్ మరికొంత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.శ్రీకాకుళంజిల్లాలో వారుసులను బరిలో దించాలని భావిస్తున్న నాయకుల సంఖ్య అధికంగానే ఉంది. స్పీకర్ తమ్నినేని సీతారాం తన కుమారుడు చిరంజీవి నాగ్ ను పోటీ చేయించాలని భావించారు. అధిష్టానం నుంచి సానుకూలత రాకపోవడంతో ఆయనే పోటీకి సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఆయనకు పోటీగా మరో వ్యక్తి బలంగా పని చేస్తుండడంతో ఇక్కడ పోటీ వాతావరణం నెలకొంది.ఇదే జిల్లాలో సీనియర్ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు కుమారుడిని బరిలోకి దించాలని భావించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి నియోజకవర్గం అంతటా ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ధర్మాన ప్రసాదరావు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, పార్టీకి పని చేస్తానన స్పష్టం చేశారు. కానీ, సీఎం జగన్ ఇందుకు అంగీకరించలేదని, మళ్లీ ఆయన్నే బరిలో దిగాలని కోరుతున్నట్టు చెబుతున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో మరోసారి బరిలో నిలిచేందుకు ధర్మాన సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్కూడా వారసుడిని అసెంంబ్లీకి పంపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా బరిలోకి దిగిన ఆయన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్య వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్లేందుకు అనుగుణంగా పని చేసుకుంటూ వచ్చారు.