సిరా న్యూస్;
మోడీ హయాంలో ఎవరూ సాధించలేం అనుకున్నవి సాధించారు. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అవుతుందని ఎవరూ అనుకోలేదు. ట్రిపుల్ తలాక్ రద్దును ఎవరూ ఊహించలేదు. రామమందిరం సఫలీకృతం అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ దేశంలో ఇవి జరగవు అన్న నిరాశలో ఉన్న జనానికి మోడీ నేను ఉన్నానని సాధించి నిరూపించారు. చట్టసభల్లో 3వ వంతు రిజర్వేషన్లను కూడా మోడీ సాధించారు.మరి ఇన్ని సాధించిన మోడీకి ఇంపార్టెంట్ ‘యూసీసీ’పై పడ్డారు. అందరికీ ఒకే పౌరసత్వం అనేది ఇప్పుడు బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్. కులం, మతం ప్రాతిపదికన విభజించిన ఈ దేశంలో ఇదే అతిపెద్ద సవాల్ గా ఉంది. పెద్ద ఉదారవాదులంతా యూసీసీని వ్యతిరేకిస్తున్నారు. యూసీసీని అమలు చేసే అవకాశాలు మెండుగా వచ్చాయి.ప్రయోగాత్మకంగా ముందు ఉత్తరాఖండ్ లో అమలు చేయబోతున్నారు. శుక్రవారం ఫిబ్రవరి 2న ఐదుగురితో కమిటీ ప్రభుత్వానికి తన నివేదిక ఇచ్చింది. కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించబోతున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 5 నుంచి 8 మధ్య అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి బిల్లు ఆమోదించనున్నారు.2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) వ్యవహారం మళ్లీ ఊపందుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అనేక మంది బీజేపీ నేతలు యూసీసీ కోసం ప్రచారాలు చేస్తున్నారు. ఇండియాలో యూనిఫార్మ్ క్రిమినల్ కోడ్ ఇప్పటికే అమల్లో ఉంది. అంటే.. నేరానికి పాల్పడే వారికి మతం, సమాజం వంటి అంశాలతో సంబంధం లేకుండా శిక్షలు అమలవుతున్నాయి. ఉమ్మడి పౌర స్మృతి కూడా ఒకరకంగా ఇలాంటిదే! కానీ చాలా క్లిష్టమైన విషయం. ప్రజల వ్యక్తిగత వ్యవహారాలైన పెళ్లి, విడాకులు, ఆస్థి పంపకాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడమే యూనిఫార్మ్ సివిల్ కోడ్.ఇండియాలో ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించి, వాటి స్థానంలో ఒకే ఒక్క చట్టాన్ని తీసుకురావడం ఈ యూసీసీ.రాజ్యాంగాన్ని రచించిన వారు ఆర్టికల్ 44లో ఈ ఉమ్మడి పౌర స్మృతిని ప్రస్తావించారు. దేశ ప్రజల ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు. అయితే.. ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని గ్రహించిన రాజ్యాంగ రూపకర్తలు.. యూసీసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చారు.వాస్తవానికి ఈ యూనిఫార్మ్ సివిల్ కోడ్పై ప్రభుత్వాలు మాట్లాడటం ఇది కొత్త విషయం ఏం కాదు. బీజేపీ కన్నా ముందే.. కేంద్రంలోని చాలా ప్రభుత్వాలు చాలాసార్లు ఈ ఉమ్మడి పౌర స్మృతిపై చర్చలు జరిపాయి. కానీ ఇప్పటివరకు యూసీసీ కార్యరూపం దాల్చలేదు. ఎందుకంటే.. యూసీసీని అమలు చేయడం చాలా కష్టమనే చెప్పుకోవాలి.ఎన్నో మతాలు, విభిన్న ఆచారాలు, సాంప్రదాయాలు, భిన్నత్వాలకు నెలవు భారత దేశం. ఇక్కడ చాలా వరకు అంశాలు మతాలు, ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉంటాయి. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులకు వేరువేరుగా చట్టాలు ఉన్నాయి. పెళ్లి నుంచి విడాకుల వరకు, ఆస్థి పంపకం నుంచి డబ్బు విషయం వరకు అన్నింటికీ వేరువేరు చట్టాలు ఉన్నాయి. అలాంటి భారత దేశంలో యూసీసీని అమలు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇండియాకు యూసీసీ అవసరం ఉందని, దానికి మద్దతిచే వారు చెబుతుంటారు. ఉమ్మడి పౌర స్మృతితో లింగ సమానత్వం ఏర్పడుతుందని, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు. ఇది నిజమే. ఉమ్మడి స్మృతితో సమాన హక్కులు లభిస్తాయి. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని సున్నితమైన, వివాదాస్పదమైన అంశాలను సైతం తొలగించవచ్చు.మరోవైపు యూనిఫార్మ్ సివిల్ కోడ్తో దేశం మొత్తం ఒక్కటవుతుందని, ఐకమత్యంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని, ప్రజల్లో లౌకికవాదం పెంపొందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.యూసీసీని అమలు చేయడమే అతిపెద్ద ప్రతికూల విషయం అని విమర్శలు అంటుంటారు. భిన్న మతాలు, ఆచారాలకు నిలవు అయిన ఇండియాలో యూసీసీ వంటి చట్టాల అమలు అసాధ్యమని, ఒక వేళ అమలు చేసినా.. ప్రజల మత స్వేచ్ఛపై భారీ ప్రభావం పడుతుందన్నది విమర్శకుల వాదన.