సిరా న్యూస్;
-30 వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు
-భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు
-నేడు ఆమె వర్ధంతి
ఆమె పాడితే చాలు కళాభిమానుల గుండెలు పరవళ్లు తొక్కుతాయి… ఆమె గానామృతం యావత్ భారతీయ సినీరంగాన్నే ఉర్రూతలూగించింది. భారతీయ సినిమా చరిత్రలో ఆమె పాడిన ప్రతీ పాటదీ ఒక ప్రత్యేకత. ఆమె జీవితం ఎందరో భావి గాయక, గాయనీమణులకు ఆదర్శం. ఆమె పేరే “లతా మంగేష్కర్”. భారతకోకిలగా, గాన సరస్వతిగా అభిమానులు ముద్దుగా పిలుచుకొనే ఆ మేటి గాయని అందర్ని వదిలి 2022 ఫిబ్రవరి 6 న 92 వయస్సు లో దివికేగింది.
1929 సెప్టెంబరు 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా జన్మించిన లతా మంగేష్కర్ అయిదవ ఏటనే సంగీతంపై మక్కువను పెంచుకున్నారు. కె.ఎల్ సైగల్ పాటలకుఆమె వీరాభిమాని. పదమూడేళ్ల వయసులో తండ్రి చనిపోయాక.. కుటుంబ పోషణ తన మీద పడడంతో లతా మంగేష్కర్ సినీ రంగంలోకి నటిగా, గాయనిగా ప్రవేశించాల్సి వచ్చింది.
1942లో పహ్లా మంగళ్ గౌర్ అనే చిత్రంలో నటించి, పాటలు కూడా పాడారు. గులాం హైదర్ అనే సంగీత దర్శకుడు లతను తన కన్నబిడ్డగా భావించి, ప్రోత్సహం ఇవ్వడంతో ఆమె మంచి నేపథ్యగాయకురాలిగా పేరు తెచ్చుకుంది. తొలుత జీవన్ యాత్ర, మందిర్ లాంటి సినిమాల్లో పాటలుపాడినా, ఆ తర్వాత అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలి వంటి హిట్ చిత్రాలు లత పాటలను ఎందరో అభిమానులకు చేరవేశాయి.
లతా నేపథ్య గాయకురాలిగా కొనసాగుతున్న కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్ గాయనిలుగా వెలుగుందుతున్నారు. దేశ విభజన సమయంలో వీరు పాకిస్థాన్ వెళ్లడం.. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత పెరగడం లతా మంగేష్కర్కు కలిసొచ్చింది. తర్వాత మంచి నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకున్నారు. సినీ ప్రయాణం ప్రారంభంలోనే లతా.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఓ మరాఠి చిత్రం కోసం ఆమె పాడిన తొలి పాటను తొలగించారు. ఆ తర్వాత ‘మజ్బూర్’లోని ‘దిల్ మేరా తోడా’ పాట పాడారు. ఇది విన్న వారంతా ఆమెను విమర్శించారు. దీనిని సవాలుగా తీసుకున్న ఈమె.. ఉర్దూలో సంగీత శిక్షణ తీసుకున్నారు.అనంతరం ‘మహల్’ సినిమాలోని ఆయేగా ఆయేగా పాటతో లతాజీ దశ తిరిగింది. వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది.