సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో ఓటర్లను ఆకట్టుకునేందుకు 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కో వ్యూహం అనుసరిస్తున్నాయి. బీజేపీ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యమని చెబుతుంటే రాహుల్ను ప్రధానిని చేయాలని కాంగ్రెస్ పిలుపునిస్తోంది. తాముంటేనే తెలంగాణకు నిజమైన అస్తిత్వముంటుందని బీఆర్ఎస్ వాదిస్తోంది. లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలోని పార్టీలు తమ ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విరుచుకుపడుతున్న టీబీజేపీ రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు నెగ్గి కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని చెబుతోంది. 2047 నాటికి దేశంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామంటోంది. మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురు అవతరించే తరుణమిదేనని కమలనాథులంటున్నారు.తెలంగాణలో ప్రజాపాలన వచ్చినట్లే కేంద్రంలో రాహుల్ను ప్రధానిగా దేశవ్యాప్తంగా ప్రజాప్రభుత్వం రావాలని తెలంగాణ కాంగ్రెస్ కోరుకుంటోంది. ఇండియా కూటమిని గెలిపించుకోవడమే లక్ష్యంగా దూసుకెళ్తోన్న రేవంత్ బీఆర్ఎస్-బీజేపీలను తూర్పారపడుతున్నారు.తెలంగాణ సమస్యలను తాము మాత్రమే పార్లమెంట్లో లేవనెత్తగలమని బీఆర్ఎస్ అంటోంది. జాతీయ పార్టీలకు తెలంగాణ సమస్యలు పట్టవని గులాబీనేతలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ గళం.. బలం తామేనంటూ గులాబీ పార్టీ రెడీ అవుతోంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది.అయితే, మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏ పార్టీ వాదానికి ప్రజలు మద్దతిస్తారో త్వరలోనే తేలనుంది.