– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ఉదయ్ కుమార్
సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
జిల్లాలో ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ(ఎఫ్ఎల్సీ) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకప్ ను అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నుండి వచ్చిన ఇంజనీరింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ఉదయ్ కుమార్ సూచించారు.
సోమవారం ఉదయం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రారంభమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి స్థాయి తనిఖీల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…..
భారత ఎన్నికలమిషన్ నియమించిన నోడల్ అధికారి( అదనపు కలెక్టర్ రెవిన్యూ) కే సీతారామారావు పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.
రానున్న నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని వివిధ పార్టీల నాయకుల సమక్షాన చేపడుతున్న ఈవీఎం తనిఖీ కార్యక్రమల వివరాలను అదనపు కలెక్టర్ తో తెలుసుకున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
భద్రత, తదితర అంశాల ఏర్పాటుపై సూచనలు చేశారు.
కేవలం ఈవీఎంల తనిఖీల విధుల కోసం నిర్వహించిన అధికారులను మాత్రమే, అది కూడా ప్రత్యేక పాసులు జారీ చేసిన వారిని మాత్రమే లోపలికి అనుమతించేలా చర్యలు చేపట్టాలని, ఏ ఒక్కరి సెల్ఫోన్లను అనుమతించొద్దని కలెక్టర్ భద్రత సిబ్బందిని ఆదేశించారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన 1300 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యంత్రాలను రానున్న పది రోజుల్లో బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వివి ప్యాట్ ల పూర్తిస్థాయి పనితీరు తనిఖీలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈవీఎంల పనితీరు, మాక్ పోలింగ్ తదితర అంశాల ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ సూచించారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూల్ నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద భద్రపరిచిన వివి ప్యాట్ల గోదామును కలెక్టర్ తనిఖీ చేసి రిజిస్టర్లు సంతకం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే సీతారామారావు, కేంద్ర ఎన్నికల సంఘం నుండి వచ్చిన ఈవీఎంల ప్రత్యేక ఇంజనీర్ అధికారులు అమోద్ కుమార్, జావిద్ అత్తర్, అనీష్ యాదవ్, ఆర్ శీను వారి బృందం, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు జాకిర్ ఆలీ, కార్తీక్ కుమార్, డీటీలు రఘు, బాలరాజ్, ఈడియం నరేష్, ఎన్ఐసి కోఆర్డినేటర్ అర్షద్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బాలకృష్ణ, కురుమయ్య, హుస్సేనయ్య తదితరులు పాల్గొన్నారు.