సిరా న్యూస్,మెదక్;
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే గా పోటీచేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంత రావు, ప్రస్తుతం ఏ పదవిలో లేకపోవటం, మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ కి బలమయిన అభ్యర్థి లేకపోవటంతో ఆయన లోక్సభ టిక్కెట్పై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది.మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గంగా గుర్తింపు ఉంది. ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ల లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆరు సెగ్మెంట్ లో గెలిచింది.బిఆర్ఎస్ కోల్పోయిన మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా మైనంపల్లి కుమారుడు గెలవటం, మైనంపల్లికు ఈ నియోజకవర్గంలో ఉన్న పట్టును తెలియజేస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. మెదక్ నుండి పోటీచేయాలంటే బీఆర్ఎస్ నుండి కేసీఆర్, హరీష్ రావు ని ఎదుర్కొనే దమ్మున్న నాయకుడు తానే అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర హేమాహేమీలు కూడా లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యేలుగా ఉండటం వలన వారిని ఎదుర్కునే సత్తా హనుమంత రావు కు మాత్రమే ఉన్నది అని కాంగ్రెస్ నాయకులూ నమ్ముతున్నారు.మెదక్ లోక్సభ పరిధిలోని సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయిన జగ్గారెడ్డితో పాటు మైనంపల్లి హనుమంత రావు లాంటి బలమైన అభ్యర్థి కనపడటంలేదు కాంగ్రెస్ పార్టీ కి.ఈ నేపథ్యంలో మైనంపల్లి సిద్దిపేట పర్యటన కు వెళ్లాలని నిర్ణయించుకోవడం ప్రాధ్యాన్యం సంతరించుకున్నది. హరీష్ రావు ను లక్షంగా చేసుకునే తన సిద్దిపేట పర్యటన ఉండబోతున్నదని రాజకీయ వర్గాల్లో అందరికి తెలిసిన విషయమే.ఆ మధ్య మెదక్ పట్టణంలో జరిగిన పార్టీ కార్యకర్తల సభలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వైఫల్యాలను హరీష్ రావు ఎండగట్టడంతో, మైనంపల్లి కూడా తాను సిద్దిపేట కి వచ్చి మరీ హరీష్ రావు వైఫల్యాలను గురుంచి మాట్లాడుతానని ఛాలెంజ్ చేసాడు.హరీష్ రావు ను తనకు మాత్రమే ఎదుర్కోగలననే విషయం నిరూపించుకొని, మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుండి తానే బలమైన అభ్యర్థినని చెప్పాలని అనుకుంటున్నాడని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు.మెదక్, రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన అనుభవం ఉండటం, తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కూడా మెదక్ ఎమ్మెల్యే గ ఉండటం మైనంపల్లి కి కలిసొస్తుందని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంటున్నారు.ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరిని ఎంపీ అభ్యర్థిగా నిలపాలనే విషయంపై, పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. జగ్గా రెడ్డి కానీ, మైనంపల్లి కానీ తాము పోటీచేస్తామని ఇంతవరకు బాహాటంగా ప్రకటించకపోయినా వారి ప్రకటనలు చుస్తే ఆ ఇద్దరు నాయకులు మెదక్ లోక్ సభ నియోజకవర్గముని దృష్టిలో పెట్టుకొనే ఈ ప్రకటనలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.