సిరా న్యూస్, చిగురుమామిడి:
బొమ్మనపల్లి లో తాగునీటి కటకట…
– ప్రత్యేక అధికారి వినయ్ సాయి తో మొరపెట్టుకున్న యువకులు
– 9వ వార్డులో పర్యటించిన ప్రత్యేక అధికారి
– నీటి సమస్య తీరుస్తామని హామీ
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం 9 వ వార్డులో తాగునీటి కటకట గురించి స్థానిక యువకులు ప్రత్యేక అధికారి వినయ్ సాయి తో మొరపెట్టుకున్నారు. బుధవారం బొమ్మనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు ప్రత్యేక అధికారి వినయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు వినయ్ ను కలిసి లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా తమ వార్డులో తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. మిషన్ భగీరథ నీళ్లు సైతం రాకపోవడంతో పొలాల నుండి నీళ్లు తీసుకు రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ప్రత్యేక అధికారి వినయ్ 9 వ వార్డులో పర్యటించి తాగునీటి ఇబ్బందుల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వార్డులో నీటి సమస్య గురించి వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేసి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.