సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ సంపదను, ఉద్యోగాలను, నీళ్లను ఆంధ్రులు దోచుకుపోతున్నారన్న ఉద్దేశం నుంచే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. స్వపరిపాల, ఇక్కడి నిధులు ఇక్కడే ఖర్చు చేయాలని, నీళ్లను తెలంగాణ భూములకు మళ్లించాలని, ఉద్యోగాల్లో తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని 60 ఏళ్లు జరిగిన ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. అయితే అప్పుడు ఆంధ్రోళ్లు మన సంపద దోచుకుపోతున్నారని ఉద్యమం చేసిన నేతలే.. ఇప్పుడు తెలంగాణ సంపదను దోచుకున్నారు. దోచుకుంటున్నారు.హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్పై జరిపిన ఏసీబీ దాడులతో బీఆర్ఎస్ డొంక కదులుతున్నట్లు తెలుస్తోంది. ఒక డైరెక్టర్స్థాయి అధికారి ఇంట్లో కిలోలకు కిలోల బంగారం, నోట్ల కట్టలు, విలువైన వస్తువులు పట్టుబడడంతో అధికారులు కూపీ లాగుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని వట్టినాగులపల్లిలో 125 ఎకరాల భూమి కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అనధికారికంగా ఇప్పటి వరకు ఏసీబీ సుమారు వెయ్యి కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది.ఇక తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్కుమార్ కూడా భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫార్మసిటీ వస్తుందన్న విషయం తెలుసుకుని, దానికి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల భూమిని తన భార్య పేరిట కొనడమే కాకుండా, తన బంధువుల పేరిట మరో 120 ఎకరాల భూములు కొనుగోలు చేశాడు. బాలకృష్ణ తర్వాత ఏసీబీ టార్గెట్ సోమేశ్కుమారే అన్న చర్చ కూడా జరుగుతోంది.తెలంగాణలో ఉన్నతస్థాయి హోదాలో ఉండి నెలనెలా లక్షల రూపాయల ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటున్న అధికారులే వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పెద్దల అండ లేకుండానే అధికారులు ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారా అన్న చర్చ జరుగుతోంది. అధికారులే వందల కోట్లు వెనకేసుకుంటే.. నేతలు ఎంత వేనకేసి ఉంటారని చర్చించుకుంటున్నారు. నాడు ఆంధ్రాపాలనకు వ్యతిరేకంగా పోరాడిన కేసీఆర్ పాలనలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ కేసీఆర్ ఎలాంటి విచారణ చేపించలేదు. ఇప్పుడ అధికారం కోల్పోయాక.. అక్రమార్కులు ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. ఇంకా ఎంత మంది బయటకు వస్తారో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల విచారణలో నేతల వివరాలు బయటపడతాయా అన్న చర్చ కూడా జరుగుతోంది.