నిన్న పటేల్.. ఇప్పుడు పీవీ…

సిరా న్యూస్,;

రాజ‌కీయాలు చిత్రంగా ఉంటాయి. ఎటువైపు నుంచి ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో కూడా చెప్ప‌డం క‌ష్టం. వ్యూహాలు.. ప్ర‌తివ్యూహాల‌కు తోడు.. నాయ‌కుల ఎత్తుగ‌డ‌లు రాజ‌కీయాల‌ను మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుస్తాయి. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇలాంటి ప‌రిణామాలే ఎదుర‌వుతున్నాయి. త‌మ వారిగా.. త‌మ పార్టీ నాయ‌కులుగా.. త‌మ నేత‌లుగా ఈ దేశానికి సేవ చేసిన వారికి పొరుగు పార్టీ, క‌ర‌డు గ‌ట్టిన ప్ర‌త్య‌ర్థి పార్టీ బీజేపీ ప్రాధాన్యం ఇవ్వ‌డం.. వారికి ఎన‌లేని గుర్తింపు తీసుకురావ‌డం.. కాంగ్రెస్ పార్టీ(అచేత‌న వ్య‌వ‌హార శైలికి నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పాలో.. లేక‌.. కాంగ్రెస్ పార్టీ వదులుకున్న `ర‌త్నా`ల‌ను వ‌డిసిప‌ట్టుకున్నార‌ని.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ క్రెడిట్ ఇవ్వాలో ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తారు. కానీ, కాంగ్రెస్ పార్టీకి ఈ ప‌రిణామాలు.. కొరుకుప‌డ‌వు.. మింగుడు ప‌డ‌వు. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ పార్టీని ఎంత‌గా ఇరుకున పెట్టాలో అంత‌గానూ ప్ర‌ధాని మోదీ ఇరుకున పెట్టేస్తున్నార‌నే చెప్పాలి. వాస్త‌వానికి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నాయ‌కులు ఉన్నారు. నెహ్రూ నుంచి ఇందిర‌మ్మ దాకా.. త‌ర్వాత రాజీవ్ వ‌ర‌కు ఎంతో మంది ఆ పార్టీకి వీర‌విధేయులుగా సేవ‌లందించారు. వారిలో ఎందరు గుర్తింపు పొందారంటే.. ఇటీవ‌ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పార్ల‌మెంటులో మాట్లాడుతూ.. “ఆ పార్టీకి కేవ‌లం త‌మ కుటుంబ‌మే క‌నిపించింది“ అన్న‌ట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెను ప్ర‌మాదంగా మారింది. ఈ దేశానికి అన‌ర్ఘ ర‌త్నాలుగా సేవ‌లందించిన అనేక మందిని ఆ పార్టీ దూరం చేసుకోగా.. బీజేపీ తెలివిగా.. ఒడిసి ప‌ట్టుకుంది. ఎన్నికల్లో ఓట్లు దూసుకుంటోంది. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌లు.. ఒక‌రు.. ఉక్కుమ‌నిషి.. స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ కాగా, రెండో వారు.. తాజాగా భార‌త‌ర‌త్న కు ఎంపికైన ధీశాలి.. సంస్క‌ర‌ణ‌ల పితామ‌హుడు.. తెలుగువారు.. స్వ‌ర్గీయ పాములప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహారావు.స‌హ‌జంగాఏ దేశ రాజ‌కీయాలు చూసినా.. ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన నాయ‌కుల‌ను ఇటువైపు పార్టీలో ఎవ‌రూ ప్ర‌శంసించ‌రు. ఏ పార్టీ కూడా వారిని త‌లుచుకునే అవ‌కాశం ఇవ్వ‌దు. కానీ, కేంద్రంలో ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ కొలువుదీరిన త‌ర్వాత‌.. వ్యూహం మారిపోయింది. ప్ర‌త్య‌ర్తి ప‌క్షంలోనూ త‌మ‌కు క‌లిసివ‌స్తార‌ని.. త‌మ కు మేలు చేస్తార‌ని భావించిన నాయ‌కుల‌ను ఓన్ చేసుకునే సంప్ర‌దాయానికి తెర‌దీశారు. పైకి.. వారిని గుర్తించిన‌ట్టు ఉంటుంది.. అంత‌ర్గ‌తంగా.. తమ రాజ‌కీయాలు పారిన‌ట్టు కూడా ఉంటుంది. ఉభ‌య కుశ‌లోప‌రి రాజ‌కీయం అంటే ఇదే! ఇదే వ్యూహానికి మోదీ ప్ర‌భుత్వం 2015లో తీసిన తెర‌వెనుకు నిలువెత్తు శిల్పంగా క‌నిపించిన మ‌నిషి.. భార‌త పూర్వ హోం శాఖ మంత్రి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌. ఈయ‌న‌ను ఓన్ చేసుకోవ‌డంలో మోదీని మించిన నాయ‌కుడు కానీ.. బీజేపీని మించిన పార్టీ కానీ.. కనిపించ‌లేదు. దేశంలో తొలిసారి.. ప‌టేల్ నిలువెత్తు విగ్ర‌హాన్ని నిర్మించారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద క‌ట్ట‌డంగా ఇది పేరు తెచ్చుకుంది. అయితే.. వాస్త‌వానికి.. ఈయన ప‌నిచేసింది.. త‌న జీవిత కాలం త‌పించింది.. ప‌ద‌వులు పొందింది కూడా.. కాంగ్రెస్‌లోనే కావ‌డం విశేషం. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంతోపాటు.. దేశం మొత్తాన్నీ ప్ర‌భావితం చేయ‌గ‌ల నాయ‌కుడిగా పేరొందిన ఉక్కు మ‌నిషి.. ప‌టేల్‌ను కాంగ్రెస్ వ‌దిలేసుకుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. అలాంటినాయ‌కుడిని ఒడిసిప‌ట్టుకోవ‌డంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌క్సెస్ అయ్యారు. గుజ‌రాత్‌కు చెందిన ప‌టేల్‌కు అగ్ర‌తాంబూలం ఇస్తూ.. తొలి ఐదేళ్ల పాల‌న‌లో ఆయ‌న పేరు త‌ల‌వ‌ని రోజు.. ఆయ‌న గురించి చెప్ప‌ని రోజు లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఫ‌లితంగా.. అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉన్న గుజ‌రాత్‌లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయింది. దేశానికి సేవ‌లందించిన అనేక మంది ప్ర‌దానుల్లో పీవీ న‌ర‌సింహారావు ఒక‌రు. అయితే.. ఆయ‌న గ‌ద్దె నెక్కే స‌మ‌యానికి బొటా బొటి మెజారిటీనే ఉంది. అలాంటి క్లిష్ట ప‌రిస్తితికి తోడు.. ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడాయి. దీంతో సంస్క‌ర‌ణ‌ల‌కు పునాదులు వేసి.. ప్రైవేకీర‌ణ‌ను, ప్ర‌పంచీక‌ర‌ణ‌ను తెర‌మీద‌కి తెచ్చి.. దేశాన్ని సంస్క‌ర‌ణ‌ల ప‌థంలో ముందుకు న‌డిపించారు. ఐదేళ్లు కూడా.. అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చినా.. ఆయ‌న వెన్ను చూప‌కుండా దేశానికి వెన్నుద‌న్నుగా నిలిచారు. అలాంటి నాయ‌కుడిని కాంగ్రెస్ అప్ప‌ట్లోనే వ‌దిలేసుకుంది. నిజ‌మో కాదో.. తెలియ‌దు కానీ.. పీవీ మ‌ర‌ణించిన‌ప్పుడు.. ఆయ‌న పార్థివ దేహాన్ని న్యూఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్‌కు తెస్తామ‌ని అన్నా.. పార్టీ వ‌ద్ద‌న్న‌ద‌ని.. ప్ర‌చారంలో ఉంది. ఇక‌, ఆ త‌ర్వాత‌. ఎప్పుడూ.. పీవీ మాట కాంగ్రెస్ నోట వినిపించ‌లేదు. అలాంటి పీవీకి ఇప్పుడు భార‌త‌ర‌త్న ఇవ్వ‌డం ద్వారా.. ప‌టేల్ మాదిరిగా.. పీవీని కూడా మోదీ సొంతం చేసుకున్నార‌నడంలో సందేహం లేదు. కాంగ్రెస్ ప్ర‌ధానిగా ఈ దేశాన్ని పాలించిన పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వ‌డం ద్వారా.. ఇప్ప‌టికిప్పుడు తెలంగాణ లో బీజేపీ పుంజుకుంటుందా.. లేదా.? అనేది ప‌క్క‌న పెడితే.. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్‌ను ఎండ‌గ‌ట్టేందుకు.. ఆ పార్టీ ఈ ప‌దేళ్ల కాలంలో ఏమాత్రమైనా సంపాయించుకుని ఉన్న సింప‌తీ ఉంటే.. దానిని బ‌దాబ‌ద‌లు చేసేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌హా క‌మ‌ల‌నాథుల‌కు పెద్ద అవ‌కాశం చేతికి చిక్కిన‌ట్టేన‌ని భావించ‌వ చ్చు. లేదంటే.. కాంగ్రెస్‌పై మ‌రింత సానుభూతి పెర‌గ‌కుండా.. క‌ట్ట‌డి చేసేందుకు ఇది అవ‌కావం ఇచ్చేచాన్స్ ఉంది. ఎలా చూసుకున్నా.. కాంగ్రెస్ వ‌దిలేసింద‌నే ప్ర‌చారంలో ఉన్న నాయ‌కుల‌కు మోదీ పెద్ద‌పీట వేశారంటేనే.. రాజ‌కీయంగా ఆలోచించ‌కుండా ఉంటారా? ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకోకుండా ఉంటారా?!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *