నటీమణులను వేశ్యలతో పోల్చిన డైరెక్టర్

బెంగళూరు,(సిరా న్యూస్); 
సినీ పరిశ్రమలో ఆడవారికి సేఫ్టీ, సెక్యూరిటీ ఉండవని అందరూ అనుకుంటూ ఉంటారు. అవన్నీ పూర్తిగా నిజాలు కావని చాలామంది నటీమణులు వాటిని కొట్టిపారేశారు. కానీ కొన్ని సంఘటనలు చూస్తే అలా అనిపించడం లేదు. తాజాగా జరిగిన మన్సూర్ అలీ ఖాన్ ఘటనే దీనికి ఉదాహరణ. ఎన్నో ఏళ్లుగా తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న మన్సూర్.. సీనియర్ హీరోయిన్ త్రిషపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం కోలీవుడ్‌లో కలకలం సృష్టించింది. చాలామంది సీనియర్ నటీనటులు, దర్శకులు మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం మన్సూర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కానీ కోలీవుడ్‌లో నటీమణులపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు వినిపించడం ఇదేమీ మొదటిసారి కాదు.సౌత్ సినిమాల్లో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పలేదు. నటుడు, రాజకీయ నాయకుడు అయిన రాధా రవి.. నయనతార లాంటి నటి రామాయణంలో సీత పాత్ర పోషించడం కరెక్ట్ కాదు అని ఓపెన్‌గా కామెంట్స్ చేశారు. ఆ సమయంలో ఇండస్ట్రీ అంతా తనకు సపోర్ట్ చేయడంతో నయనతార.. ఆయన వ్యాఖ్యలను ఖండించింది. మరొక ఈవెంట్‌లో కమెడియన్ రోబో శంకర్ కూడా హీరోయిన్ హన్సికపై ఇలాంటి కామెంట్సే చేశాడు. ఎన్నోసార్లు అడిగినా కూడా సినిమాలో హన్సికను ముట్టుకునే అవకాశం రాలేదని అన్నాడు. దానిని నవ్వుతూ జోక్‌గా చెప్పినా.. అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని కొందరు ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. 2005లో ఖుష్బూ గురించి మాట్లాడుతూ దర్శకుడు థంగర్ బచన్ తీవ్రమైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. నటీమణులను వేశ్యలతో కూడా పోల్చాడు. అప్పటినుండి ఇప్పటివరకు తమిళ సినీ పరిశ్రమలో నటీమణులపై ఇలాంటి కామెంట్స్ తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి.తాజాగా ఒక టీవీ షోలో యాంకర్ ఐశ్వర్య రఘుపతికి అందరి ముందే ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యింది. నటుడు కూల్ సురేశ్.. పూలదండ వేసే క్రమంలో ఐశ్వర్యను తాకడం మొదలుపెట్టాడు. ఐశ్వర్యకు అది ఇబ్బందికరంగా ఉందని అందరూ గమనించినా ఎవరూ మాట్లాడలేదు.త్రిష, నయనతార లాంటి సీనియర్ హీరోయిన్లు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మాట్లాడడానికి ముందుకొచ్చే ప్రేక్షకులు.. ఇతర నటీమణుల విషయంలో కూడా ఖండించడానికి ముందుకొస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *